డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి
గజ్వేల్: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ నాయిని సత్యలక్ష్మీతో కలిసి పట్టణంలోని 16వ వార్డులో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకుసాగుతుందన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్ధార్ఖాన్, నాచారం ఆలయ డైరెక్టర్ శేఖర్, కొమురవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, నాయకులు మొనగారి రాజు, నక్క రాములు తదితరులు పాల్గొన్నారు.
దుబ్బాకటౌన్: ఉపాధి హామీ పథకంలో ఒకే రోజు అత్యధిక పని దినాలు కల్పించిన గ్రామంగా మండల పరిధిలోని గాజులపల్లి ఎంపికై ంది. ఈ విషయాన్ని ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింహులు తెలిపారు. కూలీలకు అత్యధికంగా పని కల్పించినందుకు డీఆర్డీఓ జయదేవ్ ఆర్య ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింహులను శాలువాతో సత్కరించి నగదు ప్రోత్సాహకం అందజేశారు. ఎంపీడీఓ అఫ్జల్, ఏపీఓ రాజుకు అభినందనలు తెలిపారు. గ్రామాల్లోని ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా ముందుకు వచ్చి ఉపాధి హామీ కూలీలకు ఎక్కువ పని దినాలు కల్పించేందుకు కృషి చేయాలని కోరారు.
ఏబీవీపీ రాష్ట్ర కోకన్వీనర్ పరశురామ్
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేయడం తగదని, ఇలాంటి ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర వనవాసి కో కన్వీనర్ పరుశురామ్ నాయక్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పరశురామ్ నాయక్ పాల్గొని మాట్లాడారు. పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించాలనే మంచి ఆలోచనతో తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతోందన్నారు. అందులో భాగంగానే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయడంలో ఆలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. లక్షల మంది పేద విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మా, మెడిసిన్, లా లాంటి కోర్సులు చదివి దేశ, విదేశాల్లో స్థిరపడి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇస్తున్నారంటే దానికి కారణం ఫీజు రీయింబర్స్మెంట్ పథకమే అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు ఉన్న బకాయిలను చెల్లించి పేద విద్యార్థుల చదువుకు దోహదపడాలన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.
19న ‘మోడల్’ ప్రవేశ పరీక్ష
నర్సాపూర్ రూరల్: ఈనెల 19వ తేదీన మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఉంటుందని ప్రిన్సిపాల్ ఫర్హాన సోమవారం తెలిపారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 6వ తరగతిలో చేరే విద్యార్థులకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7, 8, 9, 10వ తరగతిలో చేరే విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అన్లైన్లో హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. హాల్టికెట్తో పాటు బాల్పెన్, పరీక్ష ప్యాడ్తో హాజరుకావాలని సూచించారు.


