● మాజీ మంత్రి హరీశ్రావు
● ఆర్అండ్బీ అధికారులతో సమీక్ష
సిద్దిపేటజోన్: నియోజకవర్గ పరిధిలోని పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్అండ్బీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం హయాంలో మంజూరై అర్ధంతరంగా కొన్ని రోడ్ల పనులు ఆగిపోయినట్టు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న రహదారుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే చొరవ చూపి రోడ్ల పనులను చేపట్టాలని సూచించారు. సిద్దిపేట రింగ్ రోడ్డు 80శాతం పనులు పూర్తి కాగా 20శాతం మిగిలిందన్నారు. సిద్దిపేట, చిన్నకోడూరు, ఇల్లంతకుంట వరకు ఫోర్ లేన్ల రహదారి గత ప్రభుత్వం హయాంలో 70శాతం పూర్తి కాగా ప్రస్తుత పరిస్థితుల్లో పనులు నిలిచిపోయాయన్నారు. రహదారిపై గుంతలు ఉండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, ఇల్లంతకుంట రహదారిపై దృష్టి పెట్టాలని సూచించారు. రామంచ, సిరిసిల్ల రహదారి పెండింగ్ పనులను పూర్తి చేయాలని సూచించారు. ఇర్కోడ్, రాంపూర్ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. నంగనూరు మండలంలో సీఆర్ఎఫ్ నిధులతో మంజూరైన రహదారి, బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్అండ్బీ ఎస్ఈ, ఈఈ, ఏఈలు పాల్గొన్నారు.


