మార్కెట్లో మహా రష్
● పండ్లు, పూలు కొనుగోళ్లతో కిటకిట ● పెరిగిన రేట్లతో భక్తుల ఆందోళన
ప్రశాంత్నగర్(సిద్దిపేట): మహాఽశివరాత్రిని పురస్కరించుకొని శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రధాన మార్కెట్లు కిటకిటలాడాయి. పండ్లు, పూలు, ఇతర పూజ సామగ్రి కొనుగోలు చేసే వారితో కిక్కిరిసిపోయాయి. మహాశివరాత్రి సందర్భంగా పండ్ల ధరలు పెరిగాయి. అరటి పండ్లు డజన్కు రూ.60 నుంచి రూ.80 వరకు, ద్రాక్షపండ్లు కిలో రూ.150 నుంచి రూ.200 వరకు, ఆపిల్ కిలో రూ.220 నుంచి రూ.280 వరకు, స్వీట్ పొటాటో కేజీ రూ. 50 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నారు. ఈ సంవత్సరం పండ్ల ధరలు పెరిగాయని భక్తులు వాపోతున్నారు.
ముస్తాబైన ఆలయాలు
కాగా, పట్టణంలోని ఉమాపార్థీవ కోటిలింగాల ఆలయం, యోగా లింగేశ్వర ఆలయం, నీలకంఠేశ్వర ఆలయం, శివాలయం, పార్వతిదేవి ఆలయం, మార్కండేయ ఆలయంతో పాటు ఇతర ఆలయాలు ముస్తాబయ్యాయి. జిల్లాలోనే ప్రధాన శైవక్షేత్రమైన శ్రీ ఉమాపార్థీశ్వర కోటిలింగాల ఆలయాన్ని సీపీ రష్మీ పెరుమాళ్ సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆమె ఏర్పాట్లను పరిశీలించారు. ఆదివారం ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో రానున్న నేపథ్యంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
రైతుబజార్లో పండ్లు, ఇతర పూజ సామగ్రి కొనుగోళ్లతో సందడి


