ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం
కలెక్టర్ హైమావతి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుందని కలెక్టర్ హైమావతి అన్నారు. ప్రకృతి వ్యవసాయంపై జిల్లాలో 5 రోజుల పాటుగా నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. అనంతరం మహిళా రైతులకు ధ్రువపత్రాలను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన పంటలు పండించేందుకు ప్రకృతి వ్యవసాయం ఉత్తమ మార్గమన్నారు. శిక్షణ కార్యక్రమంలో జీవామృతం, బీజామృతం, దశపర్ణి కషాయం, ఐదు పొరల సాగు నమూనా, వామ్, ట్రైకోడెర్మా తయారీ విధానాలపై కషి సఖిలకు సమగ్ర శిక్షణ అందించామని తెలిపారు. అలాగే ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి, జిల్లా వ్యవసాయ కార్యాలయ టెక్నికల్ అధికారి మైథిలి, ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.


