విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?
దుబ్బాకటౌన్: ‘విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?.. మధ్యాహ్న భోజనంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని’ కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం దౌల్తాబాద్ మండలం ఇందూప్రియల్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలలో ఒకే కూర, ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సరిపడేలా వంటలు చేయలేదని సిబ్బందిపై మండిపడ్డారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డీఈఓను ఫోన్ ద్వారా ఆదేశించారు. ప్రతీ పాఠశాలలో మెనూ తప్పక పాటించాలని ఆదేశించారు. కిచెన్ గార్డెన్లో కలుపు తీశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులకు అందించే సేవలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఫార్మసీ స్టోర్, ఇంజక్షన్ గదులు పరిశీలించారు. రోగులతో మాట్లాడి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు.
కామన్ డైట్ మెనూ తప్పనిసరి
గజ్వేల్రూరల్: కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులకు భోజనం, వసతి, చదువు విషయంలో రాజీ పడవద్దని కలెక్టర్ హైమావతి కేజీబీవీ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను ఆదేశించారు. గజ్వేల్ పట్టణంలోని బాలికల ఎడ్యుకేషన్ హబ్ సమీపంలోగల కేజీబీవీని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కేజీబీవీలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని, స్టాక్ రిజిస్టర్ను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్టాక్ రిజిస్టర్ నిర్వహణలో నిర్లక్ష్యం వద్దని, కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. విద్యార్థులందరికీ సరిపడా భోజనాన్ని రుచికరంగా వండి అందించాలని సూచించారు. భోజనం చేసే సమయంలో అన్నం, కూరలను విద్యార్థుల వద్దకే వెళ్లి వడ్డించాలన్నారు. సౌకర్యాల కల్పన, నాణ్యతలో రాజీ వద్దని, విద్యార్థులకు క్రమశిక్షణతో విద్యాబుద్దులు నేర్పాలని కేజీబీవీ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో కేజీబీవీ ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు.
‘మధ్యాహ్న భోజనం’పై
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
కలెక్టర్ హైమావతి


