బుధవారం శ్రీ 14 శ్రీ జనవరి శ్రీ 2026
భోగభాగ్యాల భోగి నేడు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): సరదాల సంక్రాంతిని సంబురంగా జరుపుకొనేందుకు అందరూ సిద్ధమయ్యారు. వాకిళ్లన్నీ రంగవల్లులతో, గొబ్బెమ్మలతో ముచ్చట గొలుపనున్నాయి. బుధవారం భోగి పండుగను నిర్వహించనున్నారు. మూడు రోజుల ముచ్చటైన పండుగ వేళ ఇంటింటా సంతోషాలు వెల్లివిరియనున్నాయి. ఏ ఇంట్లో చూసినా పిండి వంటకాల ఘుమఘుమలే.. మరోవైపు వివిధ వస్తువుల కొనుగోళ్లతో మార్కెట్లన్నీ సందడిగా మారాయి.
పతంగుల హోరు..
సంక్రాంతి పండుగ అనగానే పతంగుల హోరు కొనసాగనుంది. మార్కెట్లలో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రూ.5 నుంచి రూ.500 వరకు పతంగుల ధరలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు చిన్నారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వీటిని ఎగురవేస్తూ సందడి చేస్తున్నారు.
మురిపించనున్న ముగ్గులు
ఇళ్ల ముంగిట రంగవల్లులు ఆకట్టుకోనున్నాయి. ఇందుకు రంగుల విక్రయశాలలు వేలియడంతో కొనుగోళ్లతో సందడి నెలకొంది. అలాగే ధనుర్మాసం పురస్కరించుకుని వైష్ణవాలయాల వద్ద గోదా రంగనాయకుల కల్యాణాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అందుకుగాను ఆలయాలను అందంగా అలంకరించారు. ఈ మహోత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొననున్నారు.
బుధవారం శ్రీ 14 శ్రీ జనవరి శ్రీ 2026
బుధవారం శ్రీ 14 శ్రీ జనవరి శ్రీ 2026


