
పెండింగ్ అర్జీలు పరిష్కరించండి
● కలెక్టర్ హైమావతి ● అధికారుల గైర్హాజరుపై ఆగ్రహం ● ప్రజావాణిలో 98 దరఖాస్తులు
సిద్దిపేటరూరల్: ప్రజావాణిలో ప్రజలు అందించిన అర్జీలకు సంబంధించి పెండింగ్లను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా పెండింగ్ అర్జీలను గురించి అధికారులతో మాట్లాడారు. మే 31 వరకు పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలను తెలియజేస్తూ మంగళవారం సాయంత్రంలోగా పెండింగ్ దరఖాస్తుల వివరాలను తెలియజేయాలని ఆదేశించారు. ప్రజావాణికి తప్పనిసరిగా జిల్లా అధికారులు హాజరు కావాలన్నారు. కొందరు గైర్హాజరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు తప్పకుండా అనుమతి లేకుండా సెలవు పెట్టరాదని హెచ్చరించారు. ఇక నుంచి ప్రభుత్వశాఖల కార్యక్రమాల ప్రగతిపై 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. ఈనెల 21న జిల్లా కేంద్రంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో జిల్లా అధికారులందరూ తప్పక పాల్గొనాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే ప్రజావానిలో పలు రకాల సమస్యల పరిష్కారం కోరుతూ 98 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, వివిధశాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
అనుమతిలేని పాఠశాలపై
చర్యలు తీసుకోండి
చేర్యాల(సిద్దిపేట): ప్రభుత్వ అనుమతులు లేకుండా మూడేళ్లుగా పట్టణ కేంద్రంలో నడుస్తున్న శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామగల్ల నరేష్ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయన్నారు. కార్పొరేట్ పాఠశాలలను ప్రోత్సహిస్తూ విద్యా వ్యాపారానికి సహకరిస్తున్న విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకుని అనుమతి లేకుండా నడుస్తున్న పాఠశాలను మూసివేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందించానన్నారు.
పొలాలకు దారి చూపించండి
నా పేరు చెప్యాల రాజేశ్వరి. మాది దుబ్బాక మండలం, బల్వంతాపూర్ గ్రామం. గ్రామంలోని వ్యవసాయ భూమి వద్దకు వెళ్లేందుకు ప్రభుత్వ కుంట ఉండేది. ఆ కట్టపై నుంచి ఎన్నో ఏళ్లుగా వెళ్తూ వ్యవసాయం చేసుకుంటూ వచ్చేవాళ్ళం. కొన్ని రోజుల క్రితం కుంటను కబ్జా చేసుకున్న కొందరు వ్యక్తులు దారి లేకుండా చేశారు. ఈ విషయంపై అధికారులకు చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోవడంలేదు. సమస్య పరిష్కరించి, న్యాయం చేయాలి.
మా భూమిని ఇప్పించండి
మాది సిద్దిపేట అర్బన్ మండలం, మిట్టపల్లి గ్రామం. మాకు గ్రామంలోని 333/2 సర్వే నంబర్ లో ఎకరం భూమి ఉంది. ఆ భూమిని వంశపారంపర్యంగా 50 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటూ వస్తున్నాం. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తప్పుడు పత్రాలతో అధికారులతో చేతులు కలిపి 5 నెలల క్రితం వారిపేరుపై పట్టా మార్పిడి చేసుకున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మా భూమిని మాకు ఇప్పించి న్యాయం చేయాలని వారు వేడుకున్నారు.

పెండింగ్ అర్జీలు పరిష్కరించండి