ముదిరాజ్‌లు ఐక్యంగా ముందుకెళ్లాలి | - | Sakshi
Sakshi News home page

ముదిరాజ్‌లు ఐక్యంగా ముందుకెళ్లాలి

Jun 17 2025 6:57 AM | Updated on Jun 17 2025 6:57 AM

ముదిరాజ్‌లు ఐక్యంగా ముందుకెళ్లాలి

ముదిరాజ్‌లు ఐక్యంగా ముందుకెళ్లాలి

● మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు ● హాస్టల్‌ భవన ప్రహరీ నిర్మాణానికిశంకుస్థాపన

సిద్దిపేటఅర్బన్‌: ముదిరాజ్‌ కులస్తులు పార్టీలకతీతంగా ఐక్యంగా ఉండి అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. సోమవారం అర్బన్‌ మండలం పొన్నాలలోని ముదిరాజ్‌ హాస్టల్‌ భవన ప్రహరీకి శంకుస్థాపన చేశారు. ప్రహరీ నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్‌ నుంచి రూ.18 లక్షలు మంజూరు చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు బీసీలను ముఖ్యమంత్రిని చేసే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. జనాభాలో 56 శాతంగా ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. బీజేపీకి అవకాశం వస్తే మూడు పర్యాయాలు బీసీ బిడ్డను ప్రధానమంత్రిగా చేసుకున్నామని, రాష్ట్రపతిగా మహిళను చేశామని తెలిపారు. అవకాశం వస్తే ముదిరాజులు కూడా ఐక్యంగా అభివృద్ధికి పాటుపడాలని, ముదిరాజుల సత్తా ఏంటో ప్రపంచానికి చాటాలన్నారు. బీసీల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు ముదిరాజులను అధ్యక్షులుగా నియమించామని, బీజేపీలో ముదిరాజులకు సముచిత స్థానం దక్కుతుందని అన్నారు అంతకుముందుకు స్థానిక కాలనీ మహిళలు ఎంపీని కలిసి తమ సమస్యలను విన్నవించారు. కాలనీలో మురుగు సమస్య తీవ్రంగా ఉందని పరిష్కారం చూపించాలని కోరారు. స్పందించిన ఆయన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను కాలనీలో ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజీపీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్‌, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

పల్లెల అభివృద్ధే లక్ష్యం

మిరుదొడ్డి(దుబ్బాక): పట్టణాలకు ధీటుగా పల్లెల అభివృద్ధికి పాటు పడతానని మెదక్‌ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. మండల పరిధిలోని కొండాపూర్‌లో రెడ్డి సంఘం రీడింగ్‌ రూంకు, ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం ఆర్థికాభివృద్ధి సాధిస్తుందని అన్నారు. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అన్న నానుడిని నిజం చేయడానికి తన వంతు శాయవక్తులా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్‌, టెలికం బోర్డు మెంబర్‌ మొగుల్ల మల్లేశం, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement