
సర్దుబాటు
ఉపాధ్యాయుల
విద్యాశాఖ కసరత్తు షురూ..
● విద్యార్థుల సంఖ్యకుఅనుగుణంగా మార్పులు ● 750 మంది టీచర్లు అధికంగాఉన్నట్లు గుర్తింపు ● జూలై 15వ తేదీ వరకుకొనసాగనున్న ప్రక్రియ
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా 912 ప్రభుత్వ పాఠశాలలో 4,205 మంది ఉపాధ్యాయులు ఉండగా అందులో దాదాపు 750 టీచర్లు అధికంగా ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. వీరిని అవసరం ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయనున్నారు. జూలై 15వ తేదీ వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.
– సాక్షి, సిద్దిపేట
జిల్లా వ్యాప్తంగా 912 ప్రభుత్వ పాఠశాలల్లో 65,231 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. గత ఏడాది విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి మేరకు అదనంగా ఉన్న వారి లెక్కలు తీశారు. ఎస్జీటీలు 1,902 ఉండగా విద్యార్థుల నిష్పత్తి ఆధారంగా 400 మంది, స్కూల్ అసిస్టెంట్లు 2,303 మంది ఉండగా అదనంగా 350 మంది ఉన్నారు. వీరిలో స్కూల్ అసిస్టెంట్లు 200 మంది, ఎస్జీటీలు 150 మందిని మాత్రమే సర్దుబాటు చేసే అవకాశం ఉంది. పాఠశాలలో ఎన్రోల్మెంట్ ప్రక్రియ కొనసాగుతుండటంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందో.. తగ్గుతుందో ఈ నెల 30వ తేదీవరకు పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఉన్నత పాఠశాలలో 220 మంది విద్యార్థుల వరకు ప్రతి సబ్జెక్ట్కు ఒక ఉపాధ్యాయుడును నియమించాలి. తర్వాత విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వివిధ సబ్జెక్ట్లకు టీచర్లును నియమించనున్నారు.
ఇప్పటికే పలువురు వినతులు
గతంలో సెప్టెంబర్/అక్టోబర్ నెలలో టీచర్ల సర్దుబాటు చేసేవారు. ఈ సారి జూలై 15వ తేదీ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీంతో అనుకూలమైన పాఠశాలకు సర్దుబాటు చేసే విధంగా చూడాలని ఇప్పటికే పలువురు వినతి పత్రాలు అందజేస్తున్నారు. మరికొందరు ఉపాధ్యాయులు ప్రజా ప్రతినిధులు, యూనియన్ నేతలు, రాజకీయ నాయకులతో పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు టీచర్లు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న చోటే ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతర చోట్ల అవసరం లేకుంటే మిగులు ఉన్నా అదే పాఠశాలలో టీచర్లను కొనసాగించనున్నారు.
వచ్చే నెల 15లోగా పూర్తి చేస్తాం
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కడ పెరుగుతాయో.. ఎక్కడ తగ్గుతాయో తెలియదు. క్షేత్రస్థాయిలో ఎంత మంది ఉపాధ్యాయులు సర్ప్లస్గా ఉన్నారని పూర్తి స్థాయి సమాచారం వస్తుంది. కలెక్టర్ ఆమోదంతోనే టీచర్ల సర్దుబాటు జూలై 15వ తేదీ వరకు పూర్తి చేస్తాం. కలెక్టర్ ఆదేశాలతో ఎక్కడ కేటాయిస్తే ఆ పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది.
– శ్రీనివాస్ రెడ్డి, డీఈవో

సర్దుబాటు

సర్దుబాటు