బీజేపీది నిరంకుశ పాలన
సిద్దిపేటఅర్బన్: ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి ఆరోపించారు. ఆదివారం సిద్దిపేటలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రతిపక్షం లేకుండా మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. సమస్యలపై ప్రశ్నించే గొంతులను నొక్కుతూ నిర్భంద పాలన సాగిస్తుందని, ఈడీ, సీబీఐ సంస్థలతో ప్రశ్నించే వారిపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. మోదీ అధికారంలోకి వచ్చాకే కుంభకోణాలు పెరిగాయని, అదానీ, అంబానీ సేవలో మునిగిపోయిందని విమర్శించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయమంటే ఇంతవరకు స్పందన లేదని, రాహుల్ గాంధీపై కోర్టు తీర్పు వెలువడగానే హుటాహుటిన అనర్హత వేటు వేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మండిపడ్డారు. బీజేపీ ఆగడాలను ప్రజలకు వివరించేందుకు ఏప్రిల్ 14 నుంచి మే 15 వరకు బీజేపీ హఠావో దేశ్కో బచావో కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పేపర్ లీకేజీ వ్యవహారంతో నిరుద్యోగులు నష్టపోయారని, సీంఎ కేసీఆర్ స్పందించి యువతకు ధైర్యం ఇవ్వాలని అన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద పవన్, శంకర్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు
చాడ వెంకట్రెడ్డి