విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ రమేశ్
వట్పల్లి/జోగిపేట(అందోల్): పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని విజయడెయిరీ డిప్యూటీ డైరెక్టర్ కె.రమేశ్ అన్నారు. మంగళవారం జోగిపేటలోని విజయ పాల శీతలీకరణ కేంద్రంలో పాల ఉత్పత్తిదారుల అవగాహన సదస్సు లో పాల్గొని మాట్లాడారు. పాడి రైతులకు మద్దతు గా విజయ డెయిరీ, యూనియన్ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకొని ప్రత్యేక రుణాలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రభుత్వం గేదె పాలు లీటర్కు రూ. 6 చొప్పున, ఆవుపాలకు లీటర్కు రూ. 2 చొప్పున పెంచిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1800 మంది పాడి రైతుల నుంచి 15,400 లీటర్ల పాలసేకరణ చేస్తున్నారని చెప్పారు. గేదె పాలకు నాణ్యతను బట్టి లీటర్కు రూ.50 నుంచి రూ. 85 వరకు చెల్లిస్తున్నామన్నారు. తాజాగా పెరిగిన ధరలతో లీటర్కు రూ.56 నుంచి మొదలుకుని రూ.91 వరకు, ఆవు పాలకు లీటర్కు రూ.42 నుంచి రూ.44కు పెంచారని తెలిపారు. కార్యక్రమంలో డెయిరీ మెనేజర్ డేవిడ్, పుష్పలత, యూనియన్ బ్యాంకు మేనేజర్ ఆదిత్య, సిబ్బంది ప్రభాకర్, శ్రీను పాల్గొన్నారు.


