కేంద్రానికి మల్గి గ్రామస్తుల ఫిర్యాదు
న్యాల్కల్(జహీరాబాద్): మండల పరిధిలోని కర్నాటక సరిహద్దులో గల మల్గి గ్రామ శివారులో ఏర్పాటు కానున్న కాలుష్య కారక పరిశ్రమ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయనీయబోమని గ్రామస్తులు తెలిపారు. పరిశ్రమలతో గాలి, నీరు, నేల కలుషితమై రోగాల బారిన పడాల్సి వస్తుందని, అలాంటి పరిశ్రమలు మా గ్రామంలో వద్దే వద్దుంటూ గత జనవరిలో నిర్వహించిన ప్రాజాభిప్రాయ సేకరణలో తేల్చి చెప్పారు. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని కోరుతూ గ్రామస్తులు అప్పట్లో అదనపు కలెక్టర్ మాధురికి వినతిపత్రం అందజేశారు. అప్పటి నుంచి పరిశ్రమ ఏర్పాటు పనులు నిలిచిపోయాయి. తాజాగా పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖలకు ఫ్యాక్టరీ యాజమాన్యం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న మల్గి గ్రామస్తులు పరిశ్రమ ఏర్పాటును అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. గత రెండు, మూడు రోజులుగా గ్రామంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఆ వినతిపత్రాలను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖల అధికారులకు ఈ–మెయిల్ ద్వారా పంపించారు. కాలుష్య కారక పరిశ్రమలకు అనుమతులు ఇవ్వరాదని విజ్ఞప్తి చేశారు.


