జిల్లాలో 29 ఆర్అండ్బీ రహదారులకు మహర్దశ
వర్షాకాలం పూర్తి కాగానే పనులు
జిల్లాలో ఆర్అండ్బీ రహదారులు మెరుగుపడనున్నాయి. దశాబ్దాల కాలంగా ప్రజలు ఎదుర్కొంటున్న రవాణ ఇబ్బందులు తీరనున్నాయి. హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) పథకం కింద రోడ్లను విస్తరించడం, పటిష్టం చేయడంతో పాటు నాణ్యతగా నిర్మించనున్నారు. జిల్లాలో 29 రోడ్లు 451.17 కిలోమీటర్లకు గాను రూ.1,014.10 కోట్ల మేర నిధులు మంజూరయ్యాయి. – జహీరాబాద్
రోడ్లను పటిష్టం చేయడంతో పాటు నాణ్యవంతంగా నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్హెచ్ 65 కవేలి క్రాస్ రోడ్డు నుంచి తొరమామిడి వరకు కవేలి, కోహీర్ల మీదుగా 17.80 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి గాను రూ.20.61 కోట్లు మంజూరయ్యాయి. జహీరాబాద్ మండలంలోని అల్లీపూర్ నుంచి కొత్తూర్(బి) రహదారిని భరత్నగర్, అల్లానా మీదుగా బీదర్ రోడ్డుకు కలుపుతూ 6.70 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఇందుకోసం రూ. 7.76 కోట్లు కేటాయించారు. జహీరాబాద్–బీదర్ రహదారిని వెడల్పు చేయడంతో పాటు కొత్తగా 19.20 కిలో మీటర్లు నిర్మించేందుకు ప్రతిపాదించారు. ఇందుకోసం రూ.59.91కోట్లు మంజూరయ్యాయి. అల్లాదుర్గం–మెటల్కుంట రహదారిని పోతలబోగుడ, మేడికుందె, వట్పల్లి, రాయిపల్లి, సిరూర్, మహబత్పూర్, నగ్వార్, రాయికోడ్ల మీదుగా 30 కిలోమీటర్లు నిర్మించడానికి రూ. 217.96 కోట్ల మేర నిధులు కేటాయించారు. ఇదే రహదారిని మిర్జాపూర్(ఎన్), ముంగి, రుక్మాపూర్, రాంతీర్థ్, హద్నూర్, గంగ్వార్ల మీదుగా నిర్మించతలపెట్టారు. గుమ్మడిదల నుంచి కానుకుంట మీదుగా నుతన్కల్ రహదారి 8.20 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు రూ. 7.20 కోట్లు మంజూరు చేశారు. శంకరంపేట నుంచి నారాయణఖేడ్ రోడ్డును బుజరంపేట్, జుక్కల్ తండా, హన్మంత్రావుపేట్, లింగాపూర్ల మీదుగా సంగారెడ్డి వరకు 14.20 కిలోమీటర్లకు రూ.39 కోట్లు కేటాయించారు. నారాయణఖేడ్–మాసాన్పల్లి నుంచి తుర్కపల్లి తండా, ర్యాకల్, చెల్లగిద్దతండా, సిర్గాపూర్, నల్లవాగు, బీబీపేట్, మర్ది, కల్హేర్, మాసాన్పల్లిల మీదుగా 22.40 కిలోమీటర్లు నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.60.57 కోట్లు కేటాయించారు. నారాయణఖేడ్–సంతాపూర్ రోడ్డును జుజల్పూర్, తిమ్మాపూర్, నాగల్గిద్ద, సెమి దామరగిద్ద, పుసలపహడ్, శ్యామనాయక్తండా, శత్రునాయక్ తండా, కసర్గుత్తిల మీదుగా సంగారెడ్డి వరకు 22.30 కిలోమీటర్లు నిర్మించనున్నారు. ఇందుకు రూ.25.82 కోట్లు, పటాన్చెరు–శంకర్పల్లి రహదారిని పటాన్చెరు, కర్దనూర్, నందిగామ, భానూర్ల మీదుగా 13.20 కిలోమీటర్ల నిర్మాణానికి రూ.15.29 కోట్లు కేటాయించారు. నారాయణఖేడ్ నుంచి రాయిపల్లి రహదారిని పోచారం, లింగంపల్లి, ఉసిరికపల్లి గ్రామాల మీదుగా 8.60 కిలోమీటర్లు నిర్మించేందుకు ప్రతిపాదించారు. రూ.9.96 కోట్ల కేటాయింపులు జరిగాయి. జోగిపేట్–వట్పల్లి రహదారిని డాకూర్, తాలెల్మ, మర్వెల్లి, పల్వట్ల, నాగులపల్లి, గొర్రెకల్ గ్రామాల మీదుగా 23 కిలోమీటర్ల రోడ్డు నిర్మించనున్నారు. రూ.26.64 కోట్లు మంజూరు చేశారు. బుధేరా నుంచి వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి రహదారిని కొంశెట్పల్లి, పట్లూర్ల మీదుగా 2.40 కిలోమీటర్లు నిర్మించతలపెట్టారు. రూ.2.78 కోట్లు కేటాయించారు.
451.17 కిలోమీటర్ల మేర నిర్మాణం
రూ.1,014.10 కోట్ల నిధులు మంజూరు
తీరనున్న రవాణ ఇబ్బందులు
నారాయణఖేడ్ నుంచి రాయిపల్లి వరకు రెండో బిట్టు 10 కిలోమీటర్ల నిర్మాణానికి రూ.11.58 కోట్లు, పటాన్చెరు– మల్కాపూర్ రహదారిని ఇంద్రేశం, ఐనోల్, చిన్న కంజర్ల, పెద్ద కంజర్ల గ్రామాల మీదుగా 14 కిలోమీటర్లకు రూ.16.21 కోట్లు మంజూరయ్యాయి. ఎన్హెచ్ 65 రహదారి నుంచి ఇస్మాయిల్ఖాన్పేట్ రహదారిని లక్డారం, బ్యాతోల్ మీదుగా 11.40 కిలోమీటర్లకు రూ.13.20 కోట్లు, ఎస్ఎన్టీ రహదారిని ఇస్మాయిల్ఖాన్ పేట్ మీదుగా 6.50 కిలోమీటర్లు రూ.7.53 కోట్లతో ప్రతిపాదించారు. పెద్దపూర్–అనంత్సాగర్ రహదారిని తొగర్పల్లి, అలియాబాద్, కొండాపూర్, మారెపల్లి, అనంత్సాగర్ గ్రామాల మీదుగా 16.10 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు రూ.18.64కోట్లు కేటాయించారు. కాగా, జిల్లాలోని రహదారులను మొదటి విడతలో నిర్మించేందుకు ప్రతిపాదించారు. కొన్నింటికి టెండర్లు సైతం పూర్తి చేశారు. కొన్ని రహదారులను రెండు బిట్లుగా విభజించారు. వర్షాకాలం పూర్తి కాగానే నిర్మాణ పనులు చేపట్టనున్నారు.


