వివరాలు వెల్లడించిన ఆర్ఎంఓ డాక్టర్ సదానందం
సిద్దిపేటకమాన్: కంటి శుక్లం సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి అరుదైన కంటి ఆపరేషన్ నిర్వహించినట్లు ఆసుపత్రి నేత్ర విభాగం వైద్యులు, ఆర్ఎంఓ డాక్టర్ సదానందం తెలిపారు. బుధవారం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆసుపత్రిలో ఆయన వివరాలు వెల్లడించారు. ముండ్రాయి గ్రామానికి చెందిన భానుప్రకాశ్రెడ్డి (30) ఆరు నెలలుగా కంటి చూపు సమస్యతో ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకోగా.. కుడి కంటిలో కాంప్లికేటెడ్ క్యాటరాక్ట్ (సంక్షిష్టమైన కంటి శుక్లం) ఉన్నట్లు నిర్ధారించారు. అలాగే పుట్టుకతో ఐరిస్ కోలోబోమా, కంటిలో బలహీనమైన జోన్యూల్స్ ఉన్నట్లు గుర్తించి ఆపరేషన్ తర్వాత కంటి అద్దం కష్టతరమవుతుందని తెలిపారు. దీంతో భాను సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిని సంప్రదించగా పరీక్షించిన ఆప్తమాలజీ వైద్యులు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంగీత సూచనల మేరకు అతడికి నేత్ర విభాగం హెచ్ఓడీ డాక్టర్ కాంతశ్రీ, ఐ సర్జన్, ఆర్ఎంఓ సదానందం, డాక్టర్ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రైవేటులో ఈ చికిత్సకు సుమారు రూ.80 వేల వరకు ఖర్చు అవుతుందని, ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జూనియర్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.


