మహిళా కూలీ మృతి
హవేళిఘణాపూర్(మెదక్): మహిళా కూలీ కలుపు తీస్తుండగా అటవీ జంతువుల కోసం పెట్టిన కరెంటు వైరుకు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన మండల పరిధిలోని బి.తిమ్మాయిపల్లి గ్రామంలో మంగళవారం వెలుగు చూసింది. వివరాలిలా.. గ్రామానికి చెందిన కౌలు రైతు కిష్టయ్య తన పొలంలో అడవి పందులు వస్తున్నాయని సోమవారం రాత్రి కరెంటు షాక్ పెట్టాడు. ఉదయాన్నే తీసివేయకుండా మరిచిపోయాడు. దీంతో కూలీలతో కలుపు తీసేందుకు వచ్చిన కొండ లక్ష్మి(52) పందుల కోసం పెట్టిన వైరుకు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. పొట్టకూటి కోసం కూలీ పనికి వెళ్లిన మహిళ కరెంటుకు బలికావడంతో గ్రామస్తులు కన్నీరుమున్నీరులా విలపించారు. రైతులు పొలాల వద్ద కరెంటు షాక్ పెట్టినట్లు తమ దృష్టికి వచ్చినట్లయితే చట్టపరంగా చర్యలు తప్పవని ఏఈ నవీన్ పేర్కొన్నారు.
చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి..
రామచంద్రాపురం(పటాన్చెరు): చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన రామచంద్రాపురం పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 11వ తేదీన రామచంద్రాపురం పట్టణ పరిధిలోని అశోక్నగర్ బస్టాండ్ వద్ద గుర్తు తెలియని సుమారు 40ఏళ్ల వయస్సు గల వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అతడ్ని పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


