సంగారెడ్డి: పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేసి రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆరోపించారు. సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఎదుట ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్తో పాటు బీఆర్ఎస్ నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ పాండుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ హైకోర్టు తీర్పును సాకుగా చూపిస్తూ లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిన పథకాలను ఎత్తివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేసీఆర్ ఒక మేనమామలా పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలిచారని.. దాదాపు 3 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు సుమారు రూ.13 వేల కోట్ల మేర ఆర్థిక సహాయం అందించారని అన్నారు. ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆ తర్వాత అమలు చేయలేదని విమర్శించారు.
● సంగారెడ్డి ఎమ్మెల్యే
చింతా ప్రభాకర్ విమర్శ
● కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కొనసాగించాలని ఆందోళన


