పోటాపోటీ నినాదాలు
రామచంద్రాపురం(పటాన్చెరు): తెల్లాపూర్లో క్యూర్ అర్బన్ పాఠశాల నిర్మాణానికి కేటాయించిన స్థలం వద్ద సోమవారం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెల్లాపూర్లోని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పటాన్చెరు సర్కిల్ కార్యాలయం సమీపంలో క్యూర్ అర్బన్ పాఠశాల నిర్మాణానికి ప్రభుత్వం ఎకరం స్థలాన్ని కేటాయించింది. భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి వస్తున్నట్లు ముందురోజు బీఆర్ఎస్ స్థానిక నేతలు వాట్సాప్ గ్రూప్లో ప్రచారం చేశారు. దాంతో కాంగ్రెస్ నాయకులు అదే స్థలంలో మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అదేసమయంలో శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అక్కడి చేరుకున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులు రేవంత్రెడ్డి జిందాబాద్ అనగా బీఆర్ఎస్నాయకులు కేసీఆర్ జిందాబాద్ అంటూ పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో రోడ్డుపై వెళ్తున్న వాహనాదారులకు, ప్రజలకు ఏమీ అర్థంకాక అయోమయానికి గురయ్యారు. ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి తిరిగి వెళ్లిపోగా..ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కొల్లూర్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు.


