జహీరాబాద్ టౌన్: నలుగురు మహిళలు షాపు యజమాని దృష్టి మళ్లించి నగలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన పట్టణంలోని భవానీ మందిర్ రోడ్డులో ఉన్న ’న్యూ జై భవానీ జ్యువెలరీ’ షాపులో చోటు చేసుకుంది. జహీరాబాద్ టౌన్ ఎస్ఐ లవకుమార్ కథనం ప్రకారం.. ఈ నెల 16న సాయంత్రం నలుగురు గుర్తుతెలియని మహిళలు బుర్ఖాలు ధరించి షాపులోకి వచ్చారు. నగలు చూపించాలని షాపు యజమాని చెన్నూరి శివకుమార్ను కోరారు. అతడు నగలు చూపిస్తుండగా, మాటల్లో పెట్టి దృష్టి మళ్లించారు. ఆ సమయంలో కౌంటర్లో ఉన్న ముక్కుపుడకల బాక్స్ను గుట్టుచప్పుడు కాకుండా దొంగిలించి అక్కడ నుంచి పరారయ్యారు. బాక్స్లో సుమారు 7 తులాల బరువుగల బంగారు ముక్కుపుడకలు ఉన్నాయని బాధితుడు తెలిపాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. షాపులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


