తూప్రాన్: కుటుంబ సమస్యల కారణంగా మనస్తాపం చెందిన ఓ మహిళ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఇస్లాంపూర్లో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ గంగరాజు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సాదల వెంకటమ్మ (45), భిక్షపతి దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వారిలో ఇద్దరు కూతుళ్లకు వివాహం జరిపించారు. మూడో కూతురు మైనర్. అయితే, రెండో కూతురు భర్త విష్ణు, తన మరదలితో ప్రేమాయణం సాగించి, ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. కుటుంబ పెద్దలు జోక్యం చేసుకొని, వారికి నచ్చజెప్పి ఇంటికి తీసుకువచ్చారు. అయినప్పటికీ వారు వినకుండా తిరిగి పారిపోయారు. ఈ క్రమంలో మైనర్ అయిన ఆ మూడో కూతురు గర్భవతి అయి, ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం మెదక్లోని సీడబ్ల్యూసీ (చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) సెంటర్లో వారికి కౌన్సిలింగ్ నిర్వహించగా, తాను బావతోనే ఉంటానని స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి వెంకటమ్మ.. ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.
తోటపల్లిలో వృద్ధుడు...
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని తోటపల్లికి చెందిన కోంపెల్లి చంద్రయ్య(65) అనే వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్యంతో మనస్తాపం చెంది గురువారం ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకున్నట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. కుమార్తె సుజాత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


