రామచంద్రాపురం(పటాన్చెరు): క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ సైనికులు ఆనంద్ బాబు, ఇస్రో శాస్త్రవేత్త సుధ అన్నారు. రామచంద్రాపురం పట్టణంలో రాధిక, వినయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూలే–అంబేడ్కర్ రెజ్లింగ్, పవర్లిఫ్లింగ్ క్రీడాపోటీల ముగింపు కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడల్లో రాణించే వారికి బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూఆర్పీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, ఉపాధ్యక్షులు అభిలాష్, సామాజిక కార్యకర్త మెహర్ ఫాలిమా, లయన్స్ క్లబ్ కార్యదర్శి తులసి, నాయకులు శ్రీశైలం పాల్గొన్నారు.
రైతు వేదికలో చోరీ
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని దొంతి రైతు వేదికలో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి రైతు వేదిక కిటికీలో నుంచి లోపలికి ప్రవేశించి రెండు హౌజా స్వీకర్లు, రెండు ఫ్యాన్లు, ఎక్స్టెన్షన్ బాక్స్ను ఎత్తుకెళ్లారు. ఈఏఓ వందన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒకే ఈతలో
ఐదు మేక పిల్లలు జననం
హుస్నాబాద్: పట్టణానికి చెందిన నూనె సతీశ్ మేకల పెంపకంతో జీవనోపాధి పొందుతున్నాడు. తాను పెంచు తున్న ఒక మేక ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. మేకలు సామాన్యంగా ఒకే ఈతలో ఒకటి నుంచి లేదా మూడు పిల్లలకు జన్మనివ్వడం సర్వ సాధారణం. కానీ ఐదు మేక పిల్లలకు జన్మనివ్వడం అరుదైన విషయం. తల్లితో పాటు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని సతీశ్ తెలిపాడు.
పిడుగు పడి.. ఇద్దరికి గాయాలు
నర్సాపూర్ రూరల్: పిడుగుపాటుతో తండ్రీకొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని గూడెంగడ్డలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తె... గ్రామానికి చెందిన బాల మల్లేశ్, అతని కుమారుడు రవి గేదెలను మేపుతుండగా ఒక్కసారిగా మెరుపులతో కూడిన వర్షం కురవడంతోపాటు పిడుగు పడింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు.
బీటీ రోడ్డు
నిర్మాణ పనులు ప్రారంభం
వట్పల్లి(అందోల్): మండల కేంద్రమైన వట్పల్లిలో ప్రధాన రోడ్డు మార్గం అల్లాదుర్గ్–మెటల్కుంట ఆర్అండ్బీ రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి ఆదివారం బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం గతేడాది నిధులను మంజూరు చేసి పనులు చేపట్టింది. అయితే కాంట్రాక్టరు నిర్లక్ష్యంతో పనులు నత్తనడకనసాగుతుండటంపై ఇటీవల ‘సాక్షి’లో ‘నిలిచిన రోడ్డు విస్తరణ పనులు’అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఆర్అండ్బీ అధికారులు బీటి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.


