ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు
ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసులు
మే 13నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
మెదక్ కలెక్టరేట్: ఇటీవల విడుదలైన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులకు జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఫెయిలైన విద్యార్థులకు మే 13 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. కళాశాలకు వచ్చే విద్యార్థులకు ఆఫ్లైన్, రాని వారికి ఆన్లైన్లో అధ్యాపకులు పరీక్షలపై మెలకువలు నేర్పుతున్నారు.
ఫస్ట్ ఇయర్లో 2,554 మంది..
జిల్లాలో 58 ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలుండగా ప్రథమ సంవత్సరం(జనరల్)లో 5,710 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 3,156 మంది ఉత్తీరులయ్యారు. మరో 2,554 మంది ఫెయిలయ్యారు. ఒకేషనల్లో మాత్రం 599 మంది పరీక్ష రాయగా 440 మంది ఉత్తీర్ణత సాధించగా, 159మంది ఫెయిలయ్యారు. దీంతో ఒకేషనల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా మొదటి స్థానం సాధించింది.
సెకండియర్లో 1,516 మంది..
ఇంటర్ ద్వితీయ సంవత్సరం(జనరల్)లో మొత్తం 4,826 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 3,310 మంది ఉత్తీర్ణత సాధించారు. మరో 1,516 మంది ఫెయిలయ్యారు. ఒకేషనల్లో 539 మంది పరీక్ష రాయగా 460 ఉత్తీర్ణత సాధించగా మరో 79 మంది ఫెయిలయ్యారు.
ఒక్కో సబ్జెక్టులోనే...
ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 2,713 మంది, ద్వితీయ సంవత్సరంలో 1,595 మంది ఫెయిలయ్యారు. వీరిలో అత్యధికంగా విద్యార్థులు ఒక్కో సబ్జెక్టులోనే ఫెయిల్ కావడం గమనార్హం.
మెరుగైన బోధన..
జిల్లాలో విద్యార్థులు 70 శాతం ఒక్కో సబ్జెక్టులోనే ఫెయిలయ్యారు. వారికి ప్రత్యేక తరగతుల ద్వారా మెరుగైన బోధన అందిస్తున్నాం. మే 13 నుంచి జరిగే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా ఆన్లైన్, ఆఫ్లైన్ తరగతుల ద్వారా బోధన చేస్తున్నాం.
– మాధవి, ఇంటర్ విద్యాశాఖ అధికారి


