నారాయణఖేడ్: త్వరలోనే ఖేడ్లో శాశ్వత ఎంవీఐ కార్యాలయం ఏర్పాటుకానుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి వెల్లడించారు. ‘అరైవ్.. అలైవ్’లో భాగంగా శనివారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సౌజన్యంతో ఖేడ్ పోలీసు ఠాణాలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఆయన రక్తదాతలకు ధ్రువపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసు శాఖ శాంతి భద్రతల పరిరక్షణతోపాటు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఖేడ్లో లైసెన్స్ డ్రైవ్, ఇన్సూరెన్స్ మేళాలను నిర్వహించునున్నా మని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. తాగునీటి విషయంలో రాజకీయాలు తగవని హితవు పలికారు. డీఎస్పీ వెంకట్రెడ్డి, సీఐలు శ్రీనివాస్రెడ్డి, వెంకట్రెడ్డి, ఎస్సైలు శ్రీశైలం, రామకృష్ణ, వెంకటేశ్వర్రావు, దుర్గారెడ్డి, లయన్స్ క్లబ్ బాధ్యులు, కౌన్సిలర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రక్తదానం మరో
ప్రాణాన్ని కాపాడుతుంది
ఎమ్మెల్యే మాణిక్రావు
జహీరాబాద్ టౌన్: రక్తదానం మరో ప్రాణాన్ని కాపాడుతుందని ప్రతి ఒక్కరూ రక్తదానం చేస్తూ ప్రాణదాతలుగా నిలవాలని ఎమ్మెల్యే కె.మాణిక్రావు హితవు పలికారు. బసవ జయంతి పురస్కరించుకుని లింగాయత్ సమాజ్లో శనివారం పట్టణంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని ఎమ్మెల్యే మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...ప్రతీ ఒక్కరు 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని చెప్పారు. బసవ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ శిబిరంలో 73 మంది రక్తదానం చేయగా వారికి ఆయన ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నిర్మలారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తట్టు నారాయణ, సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్ షెట్కార్,ఆర్.సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
కుస్తీమే సవాల్
నారాయణఖేడ్: ఖేడ్ మండలంలోని ర్యాకల్ గ్రామంలోని ఎల్లమ్మ జాతర ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం కుస్తీపోటీలు నిర్వహించారు. ఈ పోటీలు హోరాహోరీగా సాగాయి. ప్రాంతం నుంచే కాకుండా కర్ణాటక, మహరాష్ట్ర ప్రాంతాల నుంచి సైతం మల్లయోధులు తరలివచ్చారు. 500మంది వరకు మల్లయోధులు స్థాయిని బట్టి పోటీలు నిర్వహించి చివరి కుస్తీ విజేతకు రూ.5,100లు బహుమతిగా అందజేశారు. పోటీలను తిలకించేందుకు జనాలు తరలివచ్చారు.


