● వైద్యం వికటించి యువతి మృతి
● వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన
పటాన్చెరు టౌన్: కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లగా వైద్యం వికటించి యువతి మృతి చెందిన ఘటన బీరంగూడ డివిజన్లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వందనపురి కాలనీకి చెందిన హారిక (28)కు బుధవారం రాత్రి కడుపునొప్పి రావడంతో పట్టణంలోని తిరుమల ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు సర్జరీ చేయాలని వివరించారు. సర్జరీ కోసం రూ.1.20 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. కుటుంబ సభ్యులు సరేనని చెప్పడంతో డాక్టర్ అన్విత సర్జరీ ప్రారంభించారు. కొద్దిసేపటికి వైద్యం వికటించడంతో యువతి మృతి చెందింది. విషయాన్ని వైద్యులు కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతిరాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. సమాచారం ఇవ్వడంలోనూ నిర్లక్ష్యంగా ప్రదర్శించారని, గతంలోనూ ఆస్పత్రిలో వైద్యం వికటించి మృతి చెందిన ఘటనలున్నాయని ఆరోపించారు. హారిక మృతికి కారకులైన వైద్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు బాధితులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హారిక కుటుంబ సభ్యులకు తిరుమల ఆస్పత్రి యాజమాన్యం చర్చలు జరిపి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకరించారు.


