● డాక్టర్లకు డీసీహెచ్ఎస్ డాక్టర్ కవిత సూచన ● జోగిపేట ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ
జోగిపేట(అందోల్): ‘ఆరోగ్యమంత్రి ఇలాఖా ఇది..అందరూ బాగా పనిచేయాలి’అంటూ ఇటీవలే బాధ్యతలు చేపట్టిన డీసీహెచ్ఎస్ డాక్టర్ కవిత వైద్యులకు సూచించారు. జోగిపేట ఏరియా ఆస్పత్రిని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల్లో ఉన్న డాక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ...మంత్రి స్వంత నియోజకవర్గం కావడం వల్ల ప్రత్యేకంగా జోగిపేట మీదనే అధికారుల దృష్టి ఉంటుందన్న విషయాన్ని మరవకూడదన్నారు. డాక్టర్లు సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి రోజు అవుట్ పేషంట్లు ఎంతమంది వస్తుంటారని, ఇన్పేషంట్లు ఎంతమంది ఉన్నారని, ప్రసవాలు ఎన్ని జరుగుతున్నాయని, అందులో నార్మల్ ఎంత? ఆపరేషన్లు ఎన్ని అవుతున్నాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌజన్యను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని పలువార్డులను డీసీహెచ్ఎస్ పరిశీలించారు. అందుతున్న వైద్య సేవలను గురించి పలువురు రోగులను అడిగి తెలుసుకున్నారు.


