● స్మార్ట్ సిటీ పనులు వేగిరం చేయాలి ● అధికారులకు కలెక్టర్ ఆదేశం
సంగారెడ్డి జోన్: స్మార్ట్ సిటీ కోసం కేటాయించిన భూములను వెంటనే స్వాధీనం చేసుకుని, పనులు ప్రారంభించాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిమ్జ్, టీజీఐఐసీ, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి దశలో 3,245 ఎకరాల భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలన్నారు. మొదటి విడతలో మిగిలి ఉన్న ఎల్గోయి, సిద్ధాపూర్, చిలేపల్లి, ముంగి, రుక్మాపూర్, హద్నూర్ గ్రామాల్లో భూము లు స్వాధీన పర్చుకొనేందుకు ప్రత్యేకంగా 6 బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి బృందంలో రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలు పూర్తి కాగానే స్వాధీనం చేసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, నిమ్స్ ప్రత్యేక అధికారి విశాలాక్షి, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ విఠల్, జహీరాబాద్ ఆర్డీఓ దేవుజా, డీఎస్పీ సైదులు నాయక్ పాల్గొన్నారు.
ఉపాధి పనుల్లో వేగం పెంచాలి
ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల కాంపౌండ్ వాల్స్ , మరుగుదొడ్లు, జీపీ బిల్డింగ్స్, మహిళా సంఘ భవనాల నిర్మాణ పనులు నిర్దిష్ట కాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రతి పనిని నాణ్యతతో చేపట్టి ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా చూడాలని సూచించారు. పనుల్లో ఆలస్యం జరగకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని అన్నారు.
గ్యాస్ కొరత సృష్టిస్తే చర్యలు
జిల్లాలో గ్యాస్ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన వంట గ్యాస్ను ఇంటి వద్దకే సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. విజిలెన్స్ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి, అక్రమ నిల్వలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.


