అగ్నిప్రమాదాలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదాలపై అవగాహన

Apr 15 2026 8:50 AM | Updated on Apr 15 2026 8:50 AM

జోగిపేట(అందోల్‌): అగ్నిమాపక వారోత్సవాలు ఈనెల 20 వరకు నిర్వహిస్తున్నట్లు జోగిపేట ఫైర్‌ ఆఫీసర్‌ టి. శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. మంగళవారం అగ్ని ప్రమాదంలో విధి నిర్వహణలో అసువులు బాసిన అగ్నిమాపక దళ సిబ్బందికి మౌనం పాటించి, వారోత్సవాల వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1944 ఏప్రిల్‌ 14న ముంబైలోని విక్టోరియా డాక్‌యార్డ్‌లో ఒక నౌకకు అగ్ని ప్రమాదం జరగడంతో 66 మంది అగ్నిమాపక దళ సిబ్బంది మరణించారు. వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.

పనితీరు భేష్‌

వైద్య సేవలపై కమిషనర్‌ కితాబు

నారాయణఖేడ్‌: పట్టణంలోని ఏరియా ఆస్పత్రిని రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వార్డులను, పరిసరాలను పరిశీలించారు. అనంతరం రోగులతో మాట్లాడి అందుతున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఆస్పత్రి రికార్డులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు, మందుల వివరాలను తెలుసుకొన్నారు. అవసరమైన పరికరాలు, సిబ్బంది, తదితర వివరాలతో నివేదికను తయారు చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా.రమేష్‌కు సూచించారు. రోగులకు అందిస్తున్న సేవలు, ఆస్పత్రి పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ కవిత ఉన్నారు.

రోడ్డు భద్రత అందరి బాధ్యత

ట్రాఫిక్‌ డీసీపీ రంజన్‌ రతన్‌ కుమార్‌

రామచంద్రాపురం(పటాన్‌చెరు): రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ రంజన్‌ రతన్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం అంబేద్కర్‌ జయంతి సందర్భంగా బెల్‌ టౌన్‌షిప్‌లో అరైవ్‌వ్‌ అలైవ్‌ కార్యక్రమంలో భాగంగా కార్మికులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలను పాటిస్తే పూర్తిస్థాయిలో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ప్రధానంగా వాహనం నడిపే సమయంలో ఏకాగ్రతతో ఉండాలని సూచించారు. అతివేగం, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ ప్రమాదాలకు దారితీస్తుందని తెలిపారు. మద్యం తాగి వాహనాలను నడిపే వారిపై కఠినంగా వ్యవరిస్తామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్‌ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బెల్‌ ఈడీ శ్రీనివాస్‌ రావు, ట్రాఫిక్‌ అడిషనల్‌ డీసీపీ హనుమంత రావు, రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్‌ కుమార్‌, ట్రాఫిక్‌ ఏసీపీ ఆదిమూర్తి, ఇన్‌స్పెక్టర్లు విద్యాసాగర్‌ రెడ్డి, లాల్‌ నాయక్‌, సురేష్‌ బాబు, ప్రశాంత్‌, కార్మిక సంఘం నేత కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

పేదలకు సంక్షేమ ఫలాలు

ఎమ్మెల్యే సంజీవరెడ్డి

పెద్దశంకరంపేట(మెదక్‌): కల్యాణలక్ష్మి పథకం పేదలకు వరమని నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ సంజీవరెడ్డి అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేటలో 93 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, 24 మందికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. అనంతరం శివాయిపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ప్రభుదాస్‌, నాయకులు మధు, నారాగౌడ్‌, మురళి, రాజేందర్‌గౌడ్‌, సంగమేశ్వర్‌, పెరుమాండ్లుగౌడ్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు, ఏపీఎం శకుంతల పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement