సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రోడ్డు భద్రతా అంశాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెడుతామని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే రోడ్డుభద్రతపై మరింత అవగాహన పెంచేందుకు ఎంతో దోహదపడుతోందని చెప్పారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం హైదరాబాద్ ఐఐటీలో అరైవ్–అలైవ్ కార్యక్రమంలో పొన్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను కోలుకోలేనంతగా దెబ్బతీస్తున్నాయని, కుటుంబాల భవిష్యత్ను చీకటిలోకి నెట్టేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్స్పాట్లను గుర్తించి, వాటిని నివారించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ ప్రమాదాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. ప్రమాదాల్లో క్షతగాత్రులను సాయం అందించే వారికి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని ప్రకటించారు. ఎంపీ రఘునందన్రావు మాట్లాడుతూ ఏటా దేశంలో 1.80 లక్షల మంది రోడ్డు ప్రమాదాలతో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణమన్నారు. చిన్నప్పటి నుంచే వాటిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ 10,081 బస్సులతో దేశంలోనే మూడో అతిపెద్ద రవాణా సంస్థగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్మూర్తి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్పంకజ్, డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి దశ నుంచే
బోధన జరిగేలా చర్యలు
మంత్రి పొన్నం ప్రభాకర్
ఐఐటీహెచ్ఓలో
‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం


