ఝరాసంగం(జహీరాబాద్): జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు వేగిరం చేయాలని నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఐసీడీసీ) సీఈఓ రజత్ కుమార్ సైనీ సూచించారు. మంగళవారం మండలంలోని బర్దిపూర్, చీలపల్లి, చీలపల్లి తండా, ఎల్గోయి, రుక్మాపూర్ తండా శివారులో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు భూములను టీజీఐఐసీ ఎండీ శశాంక, కలెక్టర్ ప్రావీణ్య అధికారులతో కలిసి పరిశీలించారు. పనులు జరుగుతున్న సమయంలో రైతులు ఎందుకు అడ్డుపడుతున్నారో అడిగి తెలుసుకున్నారు. మొదటి విడతలో సేకరించిన 3,245 ఎకరాలలో ప్రాజెక్టు నెలకొల్పనున్నట్లు అధికారులు వివరించారు. పలువురు రైతులకు పరిహారం అందకపోవడం, రెండో విడత భూ సేకరణ చేయొద్దని, భూముల కోల్పోయిన రైతులందరికీ ఒకే రకమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు. అనంతరం బర్దిపూర్ శివారులో అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఈఓ రజత్ కుమార్ మాట్లాడుతూ 24 నెలల్లో పనులు పూర్తి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. భూ ములు కోల్పోతున్న రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం అందే విధంగా చూడాలన్నారు. రహదారులు, డ్రైనేజీ, విద్యుత్ దీపాలు, తాగునీరు, తదితర మౌలిక వసతుల పనులు నాణ్యత లోపించకుండా చేపట్టాలన్నారు.
ఎన్ఐసీడీసీ సీఈఓ రజత్ కుమార్ సైనీ
భూముల పరిశీలన..
అధికారులకు సూచనలు


