సంగారెడ్డి జోన్: భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చూపిన మార్గంలో నడుచుకుని, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నర్సింహ సూచించారు. 135వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం పాత బస్టాండ్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి మంత్రితో పాటు కలెక్టర్ ప్రావీణ్య, టీజీఐఐసీ చైర్ పర్పన్ నిర్మలారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం, హక్కుల పరిరక్షణ కోసం చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ రూపకర్తగా దేశ నిర్మాణంలో ఆయన చేసిన అపార సేవలను స్మరించుకున్నారు. అంబేడ్కర్ ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి అమలు చేస్తోందని, సమాన అవకాశాలు కల్పించడంలో కృషి చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్పీ పరితోష్ పంకజ్, మున్సిపల్ చైర్పర్సన్ వనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, అడిషనల్ కలెక్టర్ పాండు, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి పాల్గొన్నారు.
సర్కార్ ధ్యేయం: మంత్రి దామోదర


