● ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ● అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం
జిన్నారం (పటాన్చెరు): సామాన్యుల ప్రాణాలతో కాలుష్యం చెలగాటమాడుతున్న పట్టనట్లుగా వ్యవహరించే అధికారుల తీరుపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. గడ్డపోతారం పట్టణ కేంద్రంలోని స్థానిక అయ్యమ్మ చెరువును సోమవారం ఆయన స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. చెరువు పూర్తిగా కాలుష్యానికి గురైన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పరిశ్రమల యాజమాన్యాలు విచ్చలవిడిగా కాలుష్య జలాలను చెరువులు కుంటల్లోకి వదులుతుండటంతో మనుషులు పశుపక్ష్యాదులు జీవన్మరణ సమస్యతో పోరాడుతున్నాయన్నారు. కాలుష్యానికి కారణమైన పరిశ్రమల యాజమాన్యాల భరతం పడతామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగం కూడా పూర్తిగా దెబ్బతిందని కాలుష్యంతో క్యాన్సర్ రోగాలు చుట్టుముడుతున్న చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. కాలుష్య కట్టడికి చర్యలు తీసుకోవాల్సిందేనని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరామయ్య, టీసీబీఈ కుమార్పాఠక్, మున్సిపల్ చైర్మన్లు సుష్మ, జనార్ధన్, నాయకులు బాల్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, వెంకటేశంగౌడ్ పట్టణ ప్రజలు పాల్గొన్నారు.


