మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీశ్ రావు
సిద్దిపేటజోన్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే తీరు చూస్తుంటే నవ్వొస్తుంది.. సీఎం మాటలు ఇవేనా.. మైకు పట్టుకుంటే తిట్ల దండకం తప్ప ఒక్క మంచి మాట ఉండదు. అన్ని శాపనార్థాలు, తిట్లు తప్పితే ఒక మంచి వార్త ఉండదని మాజీమంత్రి హరీశ్ రావు విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలో లైట్ మోటార్ వెహికిల్స్ టాక్స్ డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎటు చూసినా కేసులు, కూల్చుడు తప్ప ఇంకేమీ లేద న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆటో, టాక్సీ డ్రైవర్లను రోడ్డు మీదకు తెచ్చిందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన భవనాలను సీఎం రిబ్బన్ కటింగ్ చేస్తున్నారన్నారు. సిద్దిపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కోసం తాము కష్టపడితే ఇప్పుడు సీఎం వచ్చి ఓపెన్ చేసినట్టు విమర్శించారు. డ్రైవర్ ఆరోగ్యంగా ఉంటేనే ప్రయాణిస్తున్న వారికి రక్షణ ఉంటుందని, అందుకే ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి మందులు, అద్దాలు, ఆపరేషన్ కూడా చేయిస్తున్నట్టు పేర్కొన్నారు. సొంత డబ్బులతో లైట్ మోటార్ వెహికిల్ డ్రైవర్లకు రూ.10లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరాం, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి పాల్గొన్నారు.
సీఎం నోటి నుంచి
ఒక్క మంచి మాట రాదు
కేసులు, కూల్చుడే తప్పా చేసిందేమీ లేదు
మాజీమంత్రి హరీశ్ రావు


