శరీర భాగాల్లో రక్తస్రావం
కావడంతో హత్యగా అనుమానం
హవేళిఘణాపూర్(మెదక్): అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని బూర్గుపల్లిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తొగరి పోచయ్య(40) భార్య నాగలక్ష్మి, పిల్లలతో కలిసి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరిగిరి గ్రామంలో మేసీ్త్ర పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా భార్యతో గొడవపడిన పోచయ్య మూడేళ్ల క్రితం స్వగ్రామం బూర్గుపల్లికి వచ్చి ఉంటున్నాడు. సోమవారం ఉదయం బూర్గుపల్లిలోని ఇంటి సమీపంలో ఉరివేసుకొని కనిపించడంతో వెంటనే భార్యకు సమాచారం అందించగా ఆమె వచ్చి చూసేసరికి కాళ్లు కిందకు వేలాడుతూ కనిపించాయి. దీంతో పాటు అతని పురుషాంగం నుంచి రక్తస్రావం జరిగినట్లు ఉంది. కాగా పోచయ్యను కుటుంబ సభ్యులే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, తనకు అనుమానం ఉందని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తల్లీ, ఇద్దరు పిల్లలు అదృశ్యం
నర్సాపూర్ రూరల్: తల్లీ, ఇద్దరు పిల్లలతో అదృశ్యమైంది. ఈ సంఘటన మండలంలోని అహ్మద్నగర్లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్సై రంజిత్ రెడ్డి వివరాల ప్రకారం... అహ్మద్ నగర్కు చెందిన కాట్రోత్ నరేశ్ భార్య సునీత, ఇద్దరు పిల్లలు వైష్ణవి(10), మహేశ్(8)ను తీసుకొని గత నెల 16న ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. నరేశ్, సునీతకు మధ్య కుటుంబ విషయంలో గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన సునీత తన ఇద్దరు పిల్లలను తీసుకొని కనిపించకుండా పోయింది. భర్త ఇతర కుటుంబ సభ్యులు బంధువులతోపాటు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాట్రోత్ సునీత, వైష్ణవి, మహేశ్


