సాక్షిప్రతినిధి, సంగారెడ్డి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు దేశంలోని కోట్లాది మంది మహిళల ఆశలకు ప్రతిబింబమని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి పేర్కొన్నారు. సోమవారం సంగారెడ్డిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కుటుంబాలను చక్కదిద్దే మహిళలకు పాలన పగ్గాలు అప్పగిస్తే దేశాన్ని మరింత ముందుకు నడిపిస్తారన్నారు. దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి చర్చించడమే తప్ప, అమలు చేసి చూపిస్తున్న ధైర్యం ఒక్క ప్రధాని మోదీకే ఉందని నిరూపితమవుతోందన్నారు. చట్టసభల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు దక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. విలేకరుల సమావేశంలో ఆ పార్టీ మహిళా మోర్చా నాయకురాలు మీనాగౌడ్, తేజ, జ్యోత్స్న, కావ్య తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి


