అవయవాలు దానం చేసిన కుటుంబ సభ్యులు
సంగారెడ్డి క్రైమ్: /సంగారెడ్డి టౌన్: తాను చనిపోతూ మరికొందరికి ప్రాణదానం చేశాడు ఓ యువకుడు. వివరాలు ఇలా... సంగారెడ్డి మండలం కొతాల్లాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ స్థానికంగా వ్యాపారం చేస్తున్నాడు. అతడి కుమారుడు ఉదయ్ కుమార్ (21) బీటెక్ పూర్తి చేశాడు. ఈ నెల 4న బస్టాండ్లో బస్సు ఎక్కుతున్న క్రమంలో అతడు కళ్లు తిరిగి స్పృహతప్పి కిందపడ్డాడు. దీంతో తలకు బలమైన గాయమైంది. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా గాయం వల్ల అతడికి బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్దారించారు. కాగా శుక్రవారం కుటుంబ సభ్యుల అంగీకారంతో ఉదయ్ కుమార్కు సంబంధించిన అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఉదయ్ కుమార్ చనిపోతూ కూడా మరో ఎనిమిది మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. ఆదివారం అతడి స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.


