చేగుంట(తూప్రాన్): మూతపడిన పరిశ్రమకు సంబంధించిన పరికరాల తరలింపును ఆదివారం విద్యుత్ శాఖ అధికారులు అడ్డుకున్నారు. మండలంలోని రెడ్డిపల్లి శివారులోని జీఎస్ఎన్ పరిశ్రమ 2016లో మూతపడింది. అప్పటికే ఆ పరిశ్రమ విద్యుత్శాఖకు రూ.176 కోట్ల విద్యుత్ బిల్లులు బకాయి ఉంది. కాగా శనివారం నుంచి సదరు పరిశ్రమలోని పరికరాలను లారీల్లో తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్న విద్యుత్శాఖ అధికారులు అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. విద్యుత్ శాఖకు జీఎస్ఎన్ పరిశ్రమ యాజమాన్యం బకాయి ఉన్నందున పరికరాలను తరలించడానికి వీలు లేదని అధికారులు లారీలను నిలిపివేయించారు. అనంతరం పోలీసులకు విషయాన్ని వివరించి విద్యుత్ శాఖకు పోలీసు శాఖ తరపున తగిన సహకారం అందించాలని ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డిని అధికారులు కోరారు.


