ప్రభుత్వ కాలేజీ విద్యార్థులను ప్రోత్సహించాలి
రాష్ట్ర శాసనమండలి మాజీ ప్రోటెమ్ చైర్మన్ వి.భూపాల్రెడ్డి
రామచంద్రాపురం(పటాన్చెరు): ప్రభుత్వ కళాశాలలో చదివే విద్యార్థులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని రాష్ట్ర శాసనమండలి మాజీ ప్రొటెమ్ చైర్మన్ వి.భూపాల్రెడ్డి పేర్కొన్నారు. రామచంద్రాపురం పట్టణంలోని శ్రీగీతా భూపాల్రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం జరిగిన 18వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గతంలో ఇంటర్మీడియెట్ కళాశాల లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారని ఈవిషయాన్ని నాటి ముఖ్యమంత్రి దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకునిపోయిన వెంటనే జూనియర్ కళాశాల మంజూరు చేసి స్థలాన్ని కేటాయించారన్నారు. ఆ సమయంలో తన సొంత నిధులతోపాటు మిత్రుల సహకారంతో కార్పొరేట్ కళాశాలకు దీటుగా ఈ కాలేజీని నిర్మించినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ కళాశాలలో అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు పోటీలు పడటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక్కడి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడా,రంగోళి పోటీలలో విజయం సాధించిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు వి.సింధురెడ్డి, అంజయ్య యాదవ్, నాయకులు కుమార్గౌడ్, వి.మల్లారెడ్డి, విష్ణువర్థన్ రెడ్డి, భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు.


