వామ్మో.. పులి
లద్నూరులో పులి దాడిలో లేగదూడ మృతి
మద్దూరు(హుస్నాబాద్): మద్దూరు, దూల్మిట్ట మండలాల్లోని పలు గ్రామాల్లో రెండు రోజులుగా పులి సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు హుస్నాబాద్ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ సిద్ధార్థరెడ్డి, చేర్యాల డీఆర్వో లింగమూర్తి , ఫారెస్టు బీట్ ఆఫీసర్ రాయుడు శనివారం మండలంలోని లద్నూరు, వంగపల్లి, ఉప్పరోనిగడ్డ, వల్లంపట్ల గ్రామాల్లో సందర్శించి పులి పాదముద్రలను పరిశీలించారు. లద్నూరులో పుట్ట అనంతరెడ్డి వ్యవసాయ బావి వద్ద పులి దాడిలో లేగదూడ మృతి చెందింది. సంఘటన స్థలంలో అధికారులు కెమెరాలు ఏర్పాటు చేశారు. వల్లంపట్ల, కూటిగల్, బైరాన్పల్లి, బెక్కల్ గ్రామాల మధ్య జెనిగల వాగులో అధికారుల డ్రోన్ కెమెరాలతో పులి జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఫారెస్టు అధికారులు మాట్లాడుతూ జనగామ జిల్లాల్లోని నర్మెట మండలంలోని వెల్డండ, అమ్మాపురం గ్రామాల్లో పశువులపై దాడి చేసిన పులి అమ్మాపురం గ్రామం నుంచి లద్నూరుకు వచ్చినట్లు నిర్ధారణకు వచ్చామన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో పులి సంచరిస్తున్న నేపథ్యంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యవసాయ బావుల వద్ద ఉండే పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. కాగా, కూటిగల్, బైరాన్పల్లి, బెక్క ల్ గ్రామాల పరిధిలో జిల్లా ఫారెస్టు ఆఫీసర్ పద్మ డ్రోన్ ద్వారా పులి ఉందని గుర్తించారు. ఈ మేరకు పులిని పట్టుకోవడానికి బోన్లను తెప్పించారు.


