అప్పుల బాధతో తాపీ మేసీ్త్ర ఆత్మహత్య
కొండపాక(గజ్వేల్): అప్పుల బాధతో తాపీ మేసీ్త్ర ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. త్రీటౌన్ సీఐ లక్ష్మిబాబు వివరాల ప్రకారం... మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దశరథం కొన్నేళ్ల కింద మేసీ్త్ర పనులు చేస్తుండగా కింద పడటంతో నడుము విరిగింది. అప్పటినుంచి మేసీ్త్ర పనులు చేయలేకపోతున్నాడు. దీంతో కుటుంబ పోషణ కోసం వడ్డీ వ్యాపారుల వద్ద, ప్రైవేటు బ్యాంకులో రుణం తీసుకున్నాడు. రుణం చెల్లించకపోవడంతో వారు ఒత్తిడి చేస్తున్నారు. దీనికి తోడు తన తండ్రి మృతి చెందడంతో కార్యక్రమాల నిర్వహణ కోసం మరిన్ని అప్పులు చేశాడు. ఈ క్రమంలో రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి గదిలోకి వెళ్లి తలుపులు తీయకపోవడంతో అనుమానంతో కిటికీలోంచి చూడగా పైకప్పు కొక్కేనికి చీరతో ఉరివేసుకున్నాడు. భార్య తేజస్విని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మద్యానికి బానిసై గృహిణి..
దుబ్బాకటౌన్: మద్యానికి బానిసై గృహిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్సై కీర్తి రాజు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని అంబేడ్కర్ నగర్కు చెందిన మాడుగుల శేఖర్ కూలి పనులు చేస్తూ, భార్య మాడుగుల శారద (42), ఇద్దరు కుమారులతో జీవనం కొనసాగిస్తున్నాడు. కొంతకాలంగా భార్య శారద మద్యానికి బానిసైంది. ఈ క్రమంలో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరివేసుకుంది. గమనించిన కుమారులు తండ్రికి, పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం దుబ్బాక ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
రైలు పట్టాలపై వ్యక్తి..
తూప్రాన్: రైలు పట్టాలపై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పట్టణ సమీపంలోని బ్రాహ్మణపల్లి రైల్వే గేటు సమీపంలో శనివారం చోటు చేసుకుంది. కామారెడ్డి రైల్వే పోలీసుల వివరాల ప్రకారం... బ్రాహ్మణపల్లికి చెందిన శివపొట్టి రమేశ్(40) రైలు పట్టాలపై సికింద్రాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. కొంత కాలంగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


