కేజీబీవీల్లో ఇక కొత్త రుచులు | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీల్లో ఇక కొత్త రుచులు

Jun 17 2025 6:57 AM | Updated on Jun 17 2025 6:57 AM

కేజీబీవీల్లో ఇక కొత్త రుచులు

కేజీబీవీల్లో ఇక కొత్త రుచులు

మారిన మెనూ
● విద్యార్థులకు నెలలో రెండుసార్లు మటన్‌, ఐదుసార్లు గుడ్లు

కొండాపూర్‌(సంగారెడ్డి): గ్రామీణ ప్రాంతాలకు చెందిన అనేకమంది నిరుపేద విద్యార్థులకు కస్తూర్బాగాంధీ విద్యాలయాలు ఆసరాగా నిలుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వీటి బలోపేతానికి చర్యలు తీసుకుంటూనే ఉంది. కస్తూర్బాల్లో విద్యను అభ్యసించే బాలికల ఆరోగ్యంపై నిర్వహించిన సర్వేలో విద్యార్థినులు పౌష్టికాహారలోపంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తేలింది. దీంతో బాలికలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేజీబీవీలలో మెస్‌చార్జిలు పెంచి విద్యార్థుల ఆహార మెనూలో మార్పులు చేసింది. దీంతో విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు కొత్త మెనూ ప్రకారం ఆహారం అందజేస్తున్నారు.

ఒక్కో విద్యార్థికి నెలకు రూ.1,740

కస్తూర్బాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు నూతన ఆహార మెనూ ప్రకారం ఒక్కో విద్యార్థికి నెలకు రూ. 1,740 ఖర్చు చేస్తుంది. కేజీబీవీల్లో నూతన మెనూను అమలు చేసేందేకు ఇటీవలే హైదరాబాద్‌లో వంట కార్మికులకు శిక్షణ సైతం ఇచ్చారు. అధికారులు తరచూ పర్యవేక్షణ చేస్తే మాత్రమే మెనూ అమలు పక్కగా జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కొత్త మెనూ ప్రకారమే

విద్యా సంవత్సరం ప్రారంభం నాటి నుంచే గురుకుల పాఠశాలలో అమలు చేస్తున్న కామన్‌ మెనూను మన కేజీబీవీలలో కూడా అమలు చేస్తున్నాం. కొత్త మెనూను పకడ్బందీగా అమలు చేయాలని ఇదివరకే ఎస్‌ఓలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశాం. కొత్తగా అందించే ఆహార పట్టికను ప్రదర్శనకు ఉంచాలని సూచించాం.

–సుప్రియ, జీసీడీఓ, సంగారెడ్డి

ఇదీ మెనూ...

ప్రస్తుతం అమలులోకి వచ్చిన కొత్త మెనూ ప్రకారం వారంలో ఉదయం పూట టమాట కిచిడీ, సాంబారు, రాగిజావ, బూస్టు, పూరి, ఉప్మా, పులిహోర, బోండా, వడ, చపాతి, జీరా రైస్‌, అరటిపండు అందజేయాలి. మధ్యాహ్నం టమాటా పప్పుతో కూడిన అన్నం, నెయ్యి, రసం, పెరుగు, ఉడకబెట్టిన గుడ్లు, చికెన్‌, సాయంత్రం ఉడకబెట్టిన శెనగలు, కోడిగుడ్డు బజ్జీ, బెల్లం పల్లీలు, అల్లం చాయ్‌, మిల్లెట్‌ బిస్కెట్లు, పకోడి ఇవ్వాలి. రాత్రికి వివిధ రకాల కూరలతో తయారు చేసిన అన్నం, సాంబారు, మజ్జిగ వడ్డించాల్సి ఉంటుంది. దీనికి తోడు నెలలో రెండుసార్లు మటన్‌, అయిదుసార్లు గుడ్డు, ప్రతీ రోజు నెయ్యి అందించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement