సంగారెడ్డి టౌన్ : పట్టణంలోని వరుణ్ బేవరేజెస్ పరిశ్రమ (పెప్సీ)లో జరిగిన యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో సీఐటీయూ ఘన విజయం సాధించింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరిగింది. పరిశ్రమలో 201 మంది కార్మికులు ఓటు హక్కు కలిగి ఉండగా, 199 మంది ఓటేశారు. ఇందులో సీఐటీయూకు 129 ఓట్లు రాగా, హెచ్ఎంఎస్కు 70 ఓట్లు వచ్చాయి. హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సదానందగౌడ్ పై సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు 59 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సీఐటీయూ గెలుపొందడంతో కార్మికులు కంపెనీ ఎదుట సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ 22 ఏళ్లుగా పెప్సీ కంపెనీలో సీఐటీయూ గెలుస్తూ కార్మికుల హక్కులను కాపాడుతుందని గుర్తు చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బీ. మల్లేశం, కార్యదర్శి జి.సాయిలు, యూనియన్ ప్రధాన కార్యదర్శి బాల రాజు, రవీందర్ రెడ్డి, భీంరెడ్డి, ప్రేమ్కుమార్, షఫీ, పవన్ కుమార్, శివ, సుధాకర్, సురేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment