మంచాల: మహాత్మా బసవేశ్వరుడి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వీర శైవ లింగాయత్ బలిజ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం మండల కార్యాలయంలో సూపరింటెండెంట్ అజీమ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు కొత్తూరు శేఖరప్ప మాట్లాడుతూ.. ఈనెల 20న రాష్ట్ర ప్రభుత్వం రవీంద్రభారతిలో మహాత్మా బసవేశ్వరుడి జయంతి కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. అదే విధంగా అన్ని మండలాలు, గ్రామాల్లో సైతం కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలని కోరారు. సమాజంలో మార్పు కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి బసవేశ్వరుడని చెప్పారు. కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్షుడు జక్క హరీశ్, ప్రధాన కార్యదర్శి రాజు, సలహాదారులు రాజప్ప, పెంటప్ప, కోటప్ప తదితరులు పాల్గొన్నారు.


