పహాడీషరీఫ్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా రెడ్డి డిమాండ్ చేశారు. జల్పల్లి సర్కిల్లో మంజూరైన 360 షాదీ ముబారక్ చెక్లను గురువారం ఆమె పహాడీషరీఫ్ ప్రీమియర్ పంక్షన్హాల్లో అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రూ.లక్ష చెక్తో పాటు తులం బంగారు ఇస్తామన్నారని, ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.2,500, స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు. ప్రస్తుతం ఈ చెక్ తీసుకుంటున్న ప్రతి మహిళకు రేవంత్ సర్కార్ తులం బంగారం బాకీ ఉందని గుర్తుంచుకోవాలన్నారు. రెండేళ్ల నుంచి 13 లక్షల మంది విద్యార్థులకు రావాల్సిన రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను పెండింగ్లో పెట్టారన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని బాధ్యత గల కేసీఆర్ ప్రభుత్వం కొనసాగించిందన్నారు. చదువు విలువ తెలిసినట్లయితే బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపులో రాజకీయాలకు తావులేకుండా నిజమైన అర్హులకు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో బాలాపూర్ తహసీల్దార్ ఇందిరా దేవి, జల్పల్లి డిప్యూటీ కమిషనర్ బి.వెంకట్రామ్, నాయకులు కృష్ణారెడ్డి, పల్లపు శంకర్, షేక్ అఫ్జల్, కై సర్ బామ్, యంజాల జనార్దన్, గుండు నర్సింగ్, యంజాల అర్జున్, బర్కత్ అలీ తదితరులు పాల్గొన్నారు.


