నిబంధనలొద్దు! | - | Sakshi
Sakshi News home page

నిబంధనలొద్దు!

Jun 21 2025 7:22 AM | Updated on Jun 21 2025 7:22 AM

నిబంధనలొద్దు!

నిబంధనలొద్దు!

నిధులే ముద్దు..
‘రోడ్‌ సేఫ్టీ’ లేకుండా జీహెచ్‌ఎంసీ ఇంజినీర్ల నిర్లక్ష్యం

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లకు కాంట్రాక్టర్లతో కలిసి రోడ్లు వేయకుండానే బిల్లులు కాజేయడం తెలుసు. ఎక్కడా లేని నిబంధనలతో కావాల్సిన వారికే టెండర్లు కట్టపెట్టడమూ తెలుసు. నాణ్యత లేమితో తూతూమంత్రంగా పనులు చేయడమూ తెలుసు. ఎటొచ్చీ జేబులు నింపుకొనేందుకు చూపిస్తున్న శ్రద్ధ ప్రజలకు ప్రమాదాలు జరగకుండా ఉండటంపై చూపడం లేదు. నాసిరకం రోడ్లే కాదు.. రోడ్డు ప్రయాణాలు చేసేవారికి చూపాల్సిన మార్గదర్శకాలు పట్టించుకుంటే ఒట్టు. చివరకు సైనేజీలపైనా శీతకన్నే. సైనేజీలు, లేన్‌మార్కింగ్‌లు, అడ్డగోలు రంబుల్‌స్ట్రిప్స్‌ వల్ల ప్రజలకు ఎలా ప్రమాదాలకు ఆస్కారం ఉందో నగరంలో వాహనాల మొబిలిటీ ఎందుకు తగ్గుతుందో జీహెచ్‌ఎంసీలోని మరో విభాగమే క్షేత్రస్థాయిలో సర్వే చేసి లోపాలు తెలియజేయడం విశేషం. అంతేకాదు, రోడ్‌సేఫ్టీ చర్యల్లో భాగంగా.. రహదారుల ప్రమాణాలకు సంబంధించి దేశంలోనే అత్యున్నత సంస్థలైన ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ), మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ (మోర్త్‌) ప్రమాణాలకనుగుణంగా ఎలా ఉండాలో సూచిస్తూ జీహెచ్‌ఎంసీ ట్రాఫిక్‌ విభాగం రూపొందించిన స్టాండర్డ్‌ ఆపరేషనల్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ)ను జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు తప్పనిసరిగా పాటించాల్సిందిగా కమిషనర్‌ ఆదేశించారు.

క్షేత్రస్థాయి సర్వే నివేదిక మేరకు ..

రోడ్‌ మార్కింగ్‌లు వేస్తున్నామా అంటే వేస్తున్నాం. స్పష్టంగా కనిపించడం లేదు. చార్మినార్‌ నుంచి బంజారాహిల్స్‌, హైటెక్‌ సిటీ దాకా అదే దుస్థితి. రద్దీప్రాంతాల్లో పాదచారులకుకానీ, పాఠశాలల వద్ద విద్యార్థులకు కానీ సురక్షితంగా రోడ్డు దాటేందుకు జీబ్రా లేన్స్‌ లేవు. అబిడ్స్‌ వంటి ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందిన గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో సైతం పాదచారులు రోడ్డు దాటేందుకు ముప్పుతిప్పలు పడాల్సి వస్తోంది.

లేన్‌ మార్కింగ్‌లెందుకు?

బస్సులు వెళ్లేందుకు, సైకిళ్లు, పాదచారుల కోసం వేర్వేరు విభాగాలుగా ఉండేందుకు లేన్‌ మార్కింగ్‌లు అవసరం.. కానీ నగరంలో చాలా ప్రాంతాల్లో ఇవి కనిపించడం లేదు. దీంతో డ్రైవర్లు లేన్లను మారుస్తుండటంతో బాటిల్‌నెక్స్‌ ఏర్పడుతున్నాయి. అందుకు తాజా ఉదాహరణ చాదర్‌ఘాట్‌.

ఈ గుర్తులేవీ?

అవసరమైన ప్రాంతాల్లో ‘స్టాప్‌’, ‘నో యూ టర్న్‌’ ‘ముందుకు స్పీడ్‌బ్రేకర్‌’ ఉంది వంటి హెచ్చరికలు లేవు. ఎన్నో ప్రధాన రహదారులు, జంక్షన్లలోనూ అదే దుస్థితి. జంక్షన్ల వద్ద ఏ దారి ఎటువైపు వెళ్తుందో సూచించే సైనేజీలూ (నేవిగేషన్‌) లేవు. ఉన్నా ప్రైవేటు ప్రకటనల్లో మూసుకుపోయాయి. దీంతో నగరానికి కొత్తగా వచ్చిన వారికి కానీ, ఇతర ప్రాంతాలకు వెళ్లే నగర ప్రజలకు కానీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

రంబుల్‌స్ట్రిప్స్‌తో ప్రమాదాలు

అడ్డదిడ్డంగా ఇష్టానుసారంగా వేసిన రంబుల్‌స్ట్రిప్స్‌ వేగాన్ని తగ్గించేందుకు బదులు ప్రమాద హేతువులవుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు వాటిని దాటేటప్పుడు అదుపుతప్పి కింద పడిపోతున్నారు. ఓఆర్‌ఆర్‌ వంటి ప్రాంతాల్లో పెద్ద వాహనాలు సైతం అదుపు తప్పుతున్నాయి. ఎల్‌బీనగర్‌ – ఉప్పల్‌ మార్గంలో తరచూ ప్రమాదాలకు ఇది కూడా కారణమే. రంబుల్‌స్ట్రిప్స్‌ ఐఆర్‌సీ మార్గదర్శకాల మేరకు 10–17 మిమి ఎత్తు, 250–300 వెడల్పుతో ఉండాలి. 600 ఎంఎం గ్యాప్‌తో 6 స్ట్రిప్స్‌ ఉండాలి కానీ నగరంలో ఎత్తు మాత్రం పెంచారు.అవి సైతం ఎక్కడ పడితే అక్కడ కాకుండా పాదచారులు రోడ్డు దాటే మార్గాలకు ముందు, జంక్షన్ల వద్ద ఏర్పాటు చేయాలి. ‘రంబుల్‌స్ట్రిప్స్‌ ముందు ఉన్నాయి’ అనే సూచికలు ఉండాలి. సాఫీగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలి కానీ లోపభూయిష్ట డిజైన్లతో నడుములు విరుగుతున్నాయి.

ఏం చేయాలి ?

లోపాలను చక్కదిద్దడంతో పాటు నగరం విశ్వనగరంగా ఉండాలంటే ఆధునిక సాంకేతికతతో కూడిన కొత్త విధానాలు అందుబాటులోకి తేవాలి. సైనేజీలు, సూచికల వంటి వాటి ఏర్పాటుతోపాటు ప్రజలకు వాటి గురించి అవగాహన కలిగేలా నిరంతరం కార్యక్రమాలుండాలి. స్కూల్స్‌, హాస్పిటల్స్‌ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక గుర్తులుండాలి. ‘పాదచారి దారిలో ఉన్నారు’, ఓవర్‌ టేక్‌ చేయవద్దు, స్పీడ్‌లిమిట్‌ వంటి సూచనలు రిఫ్లెక్లివ్‌ బోర్డులతో ఏర్పాటు చేయాలి. జంక్షన్ల వద్ద కౌంట్‌డౌన్‌ టైమర్లతో కూడిన లైన్లు, పెలికాన్‌ క్రాసింగ్‌బటన్లు ఉండాలి. రంబుల్‌ స్ట్రిప్స్‌ ఇష్టానుసారం కాకుండా అవసరమైన ప్రాంతాల్లోనే వేయాలి.

బస్‌బేస్‌, ఆన్‌స్ట్రీట్‌, ఆఫ్‌స్ట్రీట్‌ పార్కింగ్‌ ప్రాంతాలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి. ఇరుకు రోడ్లకు, డివైడెడ్‌ రోడ్లకు వేర్వేకు మార్కింగ్‌ నిబంధనలుండాలి. ఫ్లై ఓవర్లు, జంక్షన్లు, వలయాకారపు జంక్షన్లు వంటి ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించే లేన్లు, మార్గదర్శక సూచనలు ఉండాలి. మలుపులున్న ప్రాంతాల్లో 15 ఎంఎం వెడల్పుతో రోడ్డుకు ఇరువైపులా తెలుపురంగు ఉండాలి. రాత్రిళ్లు కనపడేలా స్టడ్స్‌ ఉండాలి. సెన్సర్‌ ఆధారిత రంబుల్‌స్ట్రిప్స్‌ బదులు కాలం చెల్లిన స్టాటిక్‌ సిస్టమ్‌నే వాడుతున్నారు. వాటిని మార్చడంతోపాటు రంబుల్‌స్ట్రిప్స్‌ లొకేషన్స్‌, స్థితిగతులకు సంబంధించి సెంట్రలైజ్డ్‌ డేటాబేస్‌ అవసరం. జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ పోలీస్‌, ఆర్‌అండ్‌బీ, హెచ్‌ఎంఆర్‌ల మధ్య సమన్వయ లోపం వల్ల రోడ్డునిబంధనలు సవ్యంగా అమలు కావడం లేదు.

సైనేజీలు, లేన్‌మార్కింగ్‌లు, నేవిగేషన్‌లు పట్టవు

పాఠశాలలున్నా.. ప్రమాదాలు జరిగినా అంతే..

అడ్డగోలుగా రోడ్ల నిర్మాణం, ఎక్కడపడితే అక్కడ రంబుల్‌స్ట్రిప్స్‌

ఎట్టకేలకు నిద్రలేచిన బల్దియా యంత్రాంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement