నక్షత్ర తాబేళ్లు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

నక్షత్ర తాబేళ్లు స్వాధీనం

Jun 21 2025 7:22 AM | Updated on Jun 21 2025 7:22 AM

నక్షత్ర తాబేళ్లు స్వాధీనం

నక్షత్ర తాబేళ్లు స్వాధీనం

గచ్చిబౌలి: రాయదుర్గం పరిధిలో నిషేధిత నక్షత్ర తాబేళ్లు విక్రయించేందుకు యత్నించిన ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న తెలిపిన ప్రకారం..మణికొండ సాయిరాంనగర్‌లో న్యూ బ్లే స్టార్క్‌ అక్వేరియం నిర్వహించే చెరుకుల బాలస్వామి నక్షత్ర తాబేళ్లు అమ్మేందుకు సిద్ధంగా ఉంచారని సమాచారం అందడంతో ఎస్‌ఓటీ, రాయదుర్గం పోలీసులు దాడులు నిర్వహించారు. నిందితుడి నుంచి నాలుగు నక్షత్ర తాబేళ్లు, రెండు రెడ్‌ ఇయర్డ్‌ స్లైడర్‌ తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. అతని స్నేహితుడు సురేష్‌ కుమార్‌ చైన్నె నుంచి తాబేళ్లను సరఫరా చేస్తున్నాడు. నిందితుడు బాలస్వామికి నోటీసు జారీ చేస్తామని, తాబేళ్లను అటవీ శాఖ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. మరో నిందితుడు సురేష్‌ పరారీలో ఉన్నాడని చెప్పారు. కేసు ఫారెస్ట్‌ విభాగానికి బదిలీ చేస్తామని చెప్పారు.

‘విద్యుత్‌’ మరమ్మతులపై సమాచారం ఇవ్వాలి

సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్‌ లైన్ల పునరుద్ధరణ, మరమ్మతు పనులపై వినియోగదారులకు ఒక రోజు ముందే సమాచారం ఇవ్వాలని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్‌ ఫారూఖీ సంబంధిత ఇంజనీర్లకు సూచించారు. ఆటో/బైక్‌లపై సౌండ్‌ బాక్సులను ఏర్పాటు చేసుకుని ఆయా ప్రాంతాల్లో ప్రచారం చేయాలని, వినియోగదారుల మొబైల్‌ ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా విద్యుత్‌ సరఫరా నిలిపివేసే వేళలకు సంబంధించిన పూర్తి సమాచారం అందజేయాలని కోరారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా సరఫరా నిలిపివేయడం వల్ల వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం మాన్‌సూన్‌ ఏర్పాట్లపై సంబంధిత ఇంజనీర్లతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. చీఫ్‌ ఇంజనీర్లు, సూపరింటెండింగ్‌ ఇంజనీర్లు తమ పరిధిలో నిర్వహిస్తున్న మరమ్మతు పనుల షెడ్యూల్‌ను పరిశీలించడంతో పాటు విధిగా తనిఖీ చేయాలని, సిబ్బంది స్వీయ భద్రతా చర్యలు పాటించాలని, షెడ్యూల్‌ ప్రకారంగా పని పూర్తి చేయాలని సూచించారు.

ఈ నెల 26 నుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌

రామంతాపూర్‌: పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్‌ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి రెండు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ జరగనుందని రామంతాపూర్‌ ప్రభుత్వ జేఎన్‌ పాలిటెక్నిక్‌ కళాశాల హెల్ప్‌డెస్క్‌ కో ఆర్డినేటర్‌, ప్రిన్సిపాల్‌ వినయ్‌కుమార్‌ తెలిపారు. జూన్‌ 24 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో నమోదు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చునని, జూన్‌ 26 నుంచి 29 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన, 26 నుంచి జూలై 1 వరకు ఆప్షన్ల ఎంపికకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. జూలై 4 నుంచి 6 వరకు అభ్యర్థులకు సీట్లు కేటాయించిన కళాశాలలో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement