
బ్రాస్ బ్యాండ్ టీమ్ ప్రదర్శన భేష్
బండ్లగూడ: తెలంగాణ పోలీస్ అకాడమీలో 53 మంది అధికారుల బ్రాస్బ్యాండ్, బిగులర్ (వెలిడిక్షన్) పోలీస్ శిక్షణ ముగింపు కార్యక్రమం శుక్రవారం జరిగింది. ముఖ్యఅతిథిగా రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జితేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బ్రాస్ బ్యాండ్ టీం ప్రదర్శన చాలా బావుందని, ఇది భవిష్యత్తులో రాష్ట్రంలో బెస్ట్ బ్యాండ్గా గుర్తింపు పొందుతుందని ప్రశంసించారు. రాబోయే ఆగస్టు 15, రిపబ్లిక్ డే, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ టీమ్లతో ప్రదర్శనలు ఏర్పాటు చేయిస్తామన్నారు. గతంలో 10 పోలీస్ యూనిట్స్ ఉండేవని, రాష్ట్ర విభజన తర్వాత బ్రాస్ బ్యాండ్ టీమ్స్ తక్కువగా ఉన్నాయని, అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ ముందుచూపుతో ఇలాంటి నాలుగు నెలల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమన్నారు. ఇక్కడ దాదాపు 53 మంది అధికారులు కఠినమైన శిక్షణ పొందారన్నారు. అనంతరం వీరికి ప్రశంసాపత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్, అకాడమీ జాయింట్ డైరెక్టర్ డి.మురళీధర్, డిప్యూటీ డైరెక్టర్లు ఎన్.వెంకటేశ్వర్లు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
డీజీపీ డాక్టర్ జితేందర్