
ఎస్సీ, ఎస్టీలకే సబ్ప్లాన్ నిధులు
అనంతగిరి: ప్రతీ మూడు నెలలకు ఓసారి డీవీఎంసీ (డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ) సమావేశాలు నిర్వహించి సంబంధిత శాఖల అధికారులు పాల్గొని జిల్లాలోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. గురువారం ఆయన ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నుంచి వివిధ శాఖల ద్వారా ఎస్సీ వర్గాలకు వెచ్చిస్తున్న నిధులపై కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవన్నారు. ఎస్సీ, ఎస్టీ సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలన్నారు. జనాభా ప్రాతిపదికన వాటాలకు అనుగుణంగా నిధులు ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ భూ సమస్యలు పరిష్కారం చూపాలన్నారు. జూలై నుంచి ప్రతీ నెల చివరి శనివారం పౌర హక్కుల దినం నిర్వహించి ఈ కార్యక్రమానికి తహసీల్దార్, పోలీస్ అధికారి తప్పక హాజరయ్యేలా చూడాలని కలెక్టర్ ప్రతీక్జైన్కు సూచించారు. చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాస్ పథకాల్లోనూ వాటాలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు అవకాశాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవు
ప్రతీ నెల చివరి శనివారం పౌరహక్కుల దినోత్సవం నిర్వహించాలి
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య