
రేపటితో ముగియనున్న గడువు
దోస్త్ రిజిస్ట్రేషన్లకు
మూడో విడత అవకాశం
ఇబ్రహీంపట్నం: దోస్త్ మూడవ విడత రిజిస్ట్రేషన్లకు ఈ నెల 19 అవకాశం ఉన్నట్లు ఇబ్రహీంపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రాధిక తెలిపారు. తమ కళాశాలలో బీఏ, బీకాం, బీ.ఎస్సీ మొదటి సంవత్సరం కోర్సుల్లో చేరుటకు ఆన్లైన్లో ఆప్షన్స్ ఇచ్చుకోవాలని సూచించారు. ఇప్పటికే సీట్లు దక్కించున్న విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టు చేసుకోవాలని లేదంటే సీటు కోల్పోతారని చెప్పారు.
రైతులను విస్మరించిన కాంగ్రెస్
బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్
ఇన్చార్జి క్యామ మల్లేశ్
ఇబ్రహీంపట్నం రూరల్: ఎన్నికల ముందు ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్ నేడు రైతులను పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేశ్ మండిపడ్డారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఆచరణలో పెట్టడం లేదన్నారు. రూ.2లక్షల రుణమాఫీ పూర్తి చేయకుండానే రైతు భరోసాతో కొత్త మోసానికి తెరలేపిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఇస్తున్నామని చెప్పి భువనగిరి పార్లమెంట్లోని ఇబ్రహీంపట్నం మండలం, అబ్దుల్లాపూర్మెంట్ మండల రైతులకు మొండిచేయి చూపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరా ఉన్న మండలాలకు భరోసా వేయకపోవడం వెనక మతలబు ఏమిటని ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాల్లో రైతులు లేరా అని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కనీసం అవగహన లేదన్నారు. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్మెట్లో 25 వేలకు పైగా రైతులకు వెంటనే రైతు భరోసా ఇవ్వాలన్నారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్ పాలనలోనే రైతులు సుఖంగా ఉన్నారని గుర్తు చేశారు. రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్ పతనం కావడం ఖాయమన్నారు.
కృతజ్ఞతలు
మంచాల: ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పేరూరి ప్రసన్నకుమార్ శర్మ మంగళవారం నగరంలో కలిశారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ శర్మ మాట్లాడుతూ.. నూతనంగా నియామకం కావడంతో వేం నరేందర్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపినట్టు చెప్పారు. పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాల్లో పాల్గొని, ప్రజా సంక్షేమానికి కృషి చేయాలని ఆయన సూచించినట్లు తెలిపారు.
వలస కూలీ దారుణ హత్య
మొయినాబాద్: బతుకుదెరువుకు వలస వచ్చిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని కీర్తినగర్కు చెందిన దుర్గేష్ సాహు(38) మూడేళ్ల క్రితం బతుకుదెరువుకోసం కుటుంబ సభ్యులతో కలిసి మొయినాబాద్ ప్రాంతానికి వలస వచ్చాడు. కనకమామిడిలోని ఓ ఫాంహౌస్లో ఉంటూ కూలి పనిచేసేవారు. ఫాంహౌస్లో అతని కొడుకు విలాస్సాహు వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఆరు నెలల క్రితం భార్య మరణించింది. విలాస్సాహు వారం రోజుల క్రితం ఊరికి వెళ్లాడు. కాగా సోమవారం రాత్రి కనకమామిడి సమీపంలో ఉన్న స్కోప్ ఫాం వెంచర్లో కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు దుర్గేష్ సాహుపై దాడి చేసి తలపై కొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడే మృతి చెందాడు. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
37 మంది సైబర్ నేరగాళ్ల అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్న కేటుగాళ్ల ఆటకట్టించారు హైదరాబాద్ పోలీసులు. సైబర్ నేరాలు, నేరస్తులను సీరియస్ తీసుకున్న నగర కొత్వాల్ సీవీ ఆనంద్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆరు రాష్ట్రాల్లో స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహించి 37 మంది సైబర్ నిందితులను పట్టుకున్నారు. రూ.14.54 కోట్ల సొమ్మును రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. ఆయా నిందితులపై దేశవ్యాప్తంగా 178 కేసులు ఉండగా.. తెలంగాణలో ఏకంగా 74 కేసులు ఉన్నాయి.

రేపటితో ముగియనున్న గడువు