
సెల్ఫోన్ దొంగల ముఠా అరెస్టు
77 ఫోన్లు స్వాధీనం
కంటోన్మెంట్: రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయినట్లు నటిస్తూ...జాలిపడి వారి వద్దకు వచ్చే వాహనదారులు, ప్రజల సెల్ఫోన్లు దొంగిలించే ముఠా ఆటకట్టించారు బోయిన్పల్లి పోలీసులు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.25 లక్షలు విలువ చేసే 77 సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బోయిన్పల్లి పోలీసు స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏసీపీ గోపాలకృష్ణ ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన గంటా చిన్న దిల్సుఖ్నగర్లో ఉంటూ ఆటోడ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి సెల్ఫోన్ చోరీలకు పాల్పడే ముఠాతో సంబంధాలు ఏర్పడ్డాయి. అనంతరం ఒడిశాకు చెందిన ప్రధాన్ శ్రీకాంత్, ఆవుల గోపి రావులతో కలిసి ముఠాగా ఏర్పడి సెల్ఫోన్ దొంగతనాలకు అలవాటు పడ్డారు. 2017 నుంచి మూడు కమిషనరేట్ల పరిధిలో వాహనదారులు, ప్రయాణికుల నుండి సెల్ ఫోన్లు చోరీ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బోయిన్పల్లిలో తాడ్బండ్ చౌరస్తా వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండా అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా సెల్ఫోన్ స్నాచర్లుగా తేలినట్లు ఏసీపీ గోపాలకృష్ణ మూర్తి వెల్లడించారు. ఇటీవల జరిగిన సెల్ఫోన్ దొంగతనాలకు సంబంధించి సీసీ కెమెరాలు పరిశీలించిన అనంతరం ఈ ముగ్గురు అంతర్రాష్ట దొంగల ముఠాగా నిర్ధారించి అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ కేసు చేధనలో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు తులసీదాస్, రాజేశ్, మురళి, మనోహర్ రెడ్డి, శివలను ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు. విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ తిరుపతి రాజు, డీఐ సర్దార్ నాయక్, అడ్మిన్ ఎస్ఐ శివశంకర్ పాల్గొన్నారు.