
స్వాధీనంలో ఉన్నా.. భరోసా సున్నా
యాచారం: నాలుగైదేళ్లుగా సాగు సాయం అందక ఫార్మాసిటీ బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. భూములు తమ స్వాధీనంలో ఉన్నా రికార్డుల్లో లేక ఇబ్బంది పడుతున్నారు. తాము సాగు చేసుకుంటున్న పట్టాభూముల రికార్డులు తమ పేరిట మార్చి రైతు భరోసా, బ్యాంకు రుణాలు, క్రయ విక్రయాలు చేసుకునేలా సహకరించాలని ప్రాధేయపడినా కనికరించేవారే కరువయ్యారు. మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల నుంచి పది వేల ఎకరాలు సేకరించాలని నిర్ణయించి 7,500 ఎకరాల అసైన్డ్, పట్టా భూములు సేకరించింది.
టీజీఐఐసీ పేరిట 2,200 ఎకరాలు
ఫార్మాసిటీకి భూ సేకరణ సయమంలో నక్కర్తమేడిపల్లి, నానక్నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల రైతులు పట్టా భూములు ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో 2,200 ఎకరాలను టీజీఐఐసీ పేరిట మార్చేశారు. రాత్రికి రాత్రే అవార్డులు పాస్ చేసి పరిహారాన్ని స్పెషల్ అథారిటీలో జమ చేశారు. ఆ భూ రికార్డులను నిషేధిత జాబితాలో పెట్టడంతో బీఆర్ఎస్ హయాంలోని రైతుబంధు, కాంగ్రెస్ సర్కార్ ఇస్తున్న రైతు భరోసాతో పాటు బ్యాంకు రుణాలు, విరాసత్లకు అవకాశం లేకుండా పోయింది. టీజీఐఐసీ పేరిట మార్చిన భూ రికార్డులను రైతుల పేర్లపై మార్చాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా అధికారుల్లో చలనం లేదు.
3,290 మందికి భరోసా బంద్
మండల పరిధిలోని 24 పంచాయతీల్లో 19,493 మంది రైతులు రైతు భరోసాకు అర్హులుండగా 16,053 మందికి మాత్రమే నగదు జమకానుంది. 2,200 ఎకరాల పట్టా భూముల రికార్డులు టీజీఐఐసీ మీద మార్చడంతో బీఆర్ఎస్ హయాంలో మూడేళ్ల పాటు, ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ హయాంలో రెండు దఫాలుగా రైతు భరోసా నిధులు అందడం లేదు. రుణమాఫీ సైతం కాకపోవడంతో రుణాలు బకాయి పడ్డారు. ఈ దఫా సైతం రైతు భరోసా నిధులు జమ కాకపోవడంతో నానక్నగర్, తాడిపర్తి గ్రామాల్లోని రైతులు రెవెన్యూ సదస్సులను బహిష్కరించారు.
నిషేధిత జాబితాలో ఉన్న నక్కర్తమేడిపల్లి పట్టా భూమి
పట్టాభూములు టీజీఐఐసీ పేరిట
మార్చి పొట్టకొడుతున్నారు
నాలుగేళ్లుగా మొర పెట్టుకుంటున్నా
పట్టించుకోవడం లేదు
భూములు తీసుకున్నాక
రెవెన్యూ సదస్సులు ఎందుకు
బహిష్కరించిననానక్నగర్, తాడిపర్తి రైతులు