
సురేశ్ (ఫైల్)
పహాడీషరీఫ్: నల్లమందు (ఓపీఎం) విక్రయిస్తున్న వ్యక్తిని పహాడీషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్కు చెందిన ప్రజాపతి (58) కాటేదాన్కు వలస వచ్చాడు. కొన్ని రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా జల్పల్లి శ్రీరాం కాలనీలో నల్లమందును విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్సై భాస్కర్ నేతృత్వంలో బృందం ఆదివారం రాత్రి ప్రజాపతిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 250 గ్రాముల నల్లమందు, రూ.2,480 నగదు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నిందితుడిని రిమాండ్కు తరలించారు.
వ్యక్తి బలవన్మరణం
చేవెళ్ల: కడుపు నొప్పి భరించలేక ఓవ్యక్తి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చేవెళ్ల పీఎస్ పరిధిలోని కమ్మెటలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన కాశ సురేశ్(28), భార్య కవిత నార్సింగి మున్సిపాలిటీలో చెత్త సేకరణ కూలీలుగా పనిచేస్తున్నారు. కాగా అతడు కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. రోజు మాదిరిగానే ఆదివారం భార్యాపిల్లతో కలిసి భోజనం చేసి పడుకున్నారు. తెల్లవారుజామున భార్య లేచి చూసే వరకు భర్త కనిపించలేదు. బయటకు వెళ్లి చూడగా పక్కనే ఉన్న గుడిసె పైకప్పుకు తాడుతో ఉరేసుకుని కనిపించాడు. ఆందోళన చెందిన ఆమె సురేశ్ తండ్రి పెంటయ్యకు ఫోన్లో సమాచారం ఇచ్చింది. సురేశ్ తండ్రి వచ్చే వరకే సురేశ్ మృతి చెందాడు. చేవెళ్ల ప్రభుత్వాస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.